Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 Mar 2024 20:59 IST

1. పిఠాపురం నుంచి పవన్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాం: వర్మ

పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెదేపా ఇన్‌ఛార్జి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ చెప్పారు. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్మ, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ తెదేపా బాధ్యులు సుజయకృష్ణ రంగారావు.. పవన్‌తో సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను ఇద్దరు నేతలు పవన్‌కు వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రాహుల్‌ గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేరు: కిషన్‌రెడ్డి 

వచ్చే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ కలవాలని సూచించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ ముఖ్యనేతలు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఉగ్రవాది.. ఏ భాషలోనైనా ఉగ్రవాదే: జైశంకర్‌

భారత్‌- రష్యా సంబంధాల (India- Russia Ties)పై విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కోతో దిల్లీకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మూడు రోజుల సింగపూర్‌ పర్యటనలో ఉన్న జైశంకర్‌ ఆదివారం అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో.. చైనా వైపు రష్యా మళ్లుతుందనే భావననూ తోసిపుచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ఏమిటీ ఘోస్ట్‌ జాబ్స్‌.. ఉద్యోగ నియామకాల్లో ఎందుకీ ధోరణి..?

సాధారణంగా సంస్థలు తమ కంపెనీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తాయి. ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలకు అటెండ్‌ అవుతారు. అయితే.. కొన్ని కంపెనీల విషయంలో నెలల పాటు ఎదురుచూసినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. ఆరా తీస్తే చివరకు ఆ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలే లేవనే విషయం తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. వారికి సీట్లిస్తే.. రాజకీయ వారసత్వమా: సిద్ధరామయ్య

మంత్రుల పిల్లలు, కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వడం వారసత్వ రాజకీయం కాదని కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. ఓటర్ల మద్దతు ఉండటం వ్లలే వారికి సీట్లు ఇస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల (LokSabha Elections 2024) కోసం కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాష్ట్ర కేబినెట్‌లోని ఐదుగురు మంత్రుల కుటుంబసభ్యులకు టికెట్లు కేటాయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. లోకేశ్‌ లక్ష్యంగా.. ‘కోడ్‌’ పేరుతో పదేపదే కాన్వాయ్‌ తనిఖీలు : తెదేపా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని.. ఎన్నికల కోడ్‌ పేరుతో పోలీసులు పదేపదే ఆయన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట వద్ద లోకేశ్‌ కాన్వాయ్‌ను పోలీసులు ఒకే రోజు రెండు సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజుల్లో నాలుగు సార్లు కాన్వాయ్‌ ఆపి సోదాలు చేశారు. కోడ్‌ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్‌లోని కార్లన్నింటినీ పరిశీలించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. 40 ఏళ్ల కిందటి కేసు.. ‘చూయింగ్‌ గమ్‌’తో దొరికిపోయి!

నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చూయింగ్‌ గమ్‌లోని డీఎన్‌ఏ ఆనవాళ్లు నిందితుడిని పట్టించడం గమనార్హం. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓరెగాన్‌లోని మౌంట్‌ హూడీ కమ్యూనిటీ కాలేజీలో బార్బారా టక్కర్‌ (19) విద్యార్థిని. జనవరి 15, 1980న ఆమె అపహరణకు గురయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  ‘పీవోకే భారత్‌లో విలీనమవుతుంది’.. విశ్వాసం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌లో విలీనం కావాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజల నుంచే స్వయంగా డిమాండ్లు వస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. పీవోకే ప్రజలు భారత్‌లో విలీనం అవుతారనే విశ్వాసం తనకు ఉందన్నారు. కశ్మీర్‌పై పాక్‌ ప్రధాని ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కీవ్‌పై రాకెట్లతో విరుచుకుపడిన రష్యా.. మాస్కోపై పోలండ్‌ ఆగ్రహం

ఉక్రెయిన్‌ (Ukriane) రాజధాని కీవ్‌ (Kyiv) నగరంపై ఆదివారం రష్యా (Russia) రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఒక రాకెట్‌ నిబంధనలకు విరుద్ధంగా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిందని పోలండ్‌ (Poland) ఆగ్రహం వ్యక్తం చేసింది. కీవ్‌ లక్ష్యంగా రష్యా రాకెట్ల దాడి చేయడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. దీనిపై ఉక్రెయిన్‌ ప్రకటన విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. హోలీ వేళ స్నాప్‌చాట్‌ పిచికారీ లెన్స్‌.. ఎలా పనిచేస్తుందంటే?

హోలీ సందర్భంగా స్నాప్‌చాట్‌ మరో కొత్త లెన్స్‌ను తీసుకొచ్చింది. ఏఆర్‌ పిచికారీ పేరిట తీసుకొచ్చిన దీనితో స్నేహితులకు వర్చువల్‌ రంగులను పూయొచ్చు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీలో ఇప్పటికే పలు లెన్స్‌లను అందిస్తున్న ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ తాజాగా దీన్ని తీసుకొచ్చింది. ఏఆర్‌ పిచికారీ లెన్స్‌ను థర్డ్‌ పార్టీ డెవలపర్‌ రోనిన్‌ ల్యాబ్స్‌ రూపొందించింది. ఇతర ఏఆర్‌ లెన్స్‌ల తరహాలోనే స్నాప్‌చాట్‌ సెర్చ్‌ బార్‌లో వెతికి దీన్ని పొందొచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని