Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 03 Mar 2024 13:00 IST

1. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?: చంద్రబాబు

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని విమర్శించారు. ‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్‌ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తి కథనం

2. సీఎం రేవంత్‌ను కలిసిన భారాస ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డితో భారాసకు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. కుటుంబసభ్యులతో వెళ్లి సీఎంను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.పూర్తి కథనం

3. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి.. అనవసర విమర్శలొద్దు: పొన్నం ప్రభాకర్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్‌లో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్‌ రీడింగ్‌ను తీసి స్వయంగా జీరో బిల్లులను  మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. పూర్తి కథనం

4. మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

భారత మీడియా చేసిన ఓ ఇంటర్వ్యూ చైనాకు ఆగ్రహం తెప్పించింది. తమ అనుమతి లేకుండా ఎలా చేస్తారంటూ మండిపడింది. న్యూదిల్లీ మీడియా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఫిబ్రవరి చివరల్లో తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది.పూర్తి కథనం

5. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల మహా పాదయాత్ర

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు మహా పాదయాత్ర నిర్వహించాయి. కూర్మన్న పాలెంలోని దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లారు.పూర్తి కథనం

6. హైతీలో జైలు బద్దలు.. వందల మంది ఖైదీల పరారు..!

హైతీ (Haiti) రాజధాని పోర్ట్‌ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు శనివారం తప్పించుకొన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్‌ యూనియన్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది.పూర్తి కథనం

7. సార్క్‌ పునరుద్ధరణ ఇప్పట్లో లేనట్లే: విదేశాంగ మంత్రి జైశంకర్‌

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (SAARC) తక్షణ పునరుద్ధరణను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. సభ్యదేశమైన పాకిస్థాన్‌ (Pakistan) ఉగ్రవాద అనుకూల వైఖరే అందుకు అవరోధమని కుండబద్దలు కొట్టారు. ఈ కూటమిలోని ఇతర దేశాలపైనా పాక్‌ అదే తీరును అనుసరిస్తోందని దుయ్యబట్టారు. పూర్తి కథనం

8. ఆసీస్‌ చేతిలో కివీస్‌ ఘోర ఓటమి.. అగ్రస్థానానికి చేరిన భారత్‌

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ (NZ vs AUS) ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. అదేంటి ఆ జట్టు ఓడిపోతే మనకు కలిగిన లాభమేంటనేగా? మీ సందేహం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లోగా టాప్ -2 జట్లు ఫైనల్‌లో తలపడతాయి.పూర్తి కథనం

9. వారిద్దరు భారత జట్టులోకి రావాలంటే.. ఐపీఎల్‌లో రాణిస్తేనే సరిపోదు!

ఇషాన్ కిషన్, శ్రేయస్‌ అయ్యర్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను కోల్పోవడంపై చర్చ నడుస్తున్న వేళ.. బీసీసీఐ ఆగ్రహానికి గల కారణాలు ఒక్కోటి వెల్లడవుతూ ఉన్నాయి. వారిద్దరి స్వయంకృతం వల్లే కాంట్రాక్ట్‌ను చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభం కానుంది.పూర్తి కథనం

10. తృణమూల్‌కు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి: జైరాం రమేశ్‌

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఇప్పటికే నిర్ణయించింది. అయినప్పటికీ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ (Congress) ఆదివారం ప్రకటించడం గమనార్హం.
 పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని