Telangana News: ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. 

Updated : 07 Feb 2023 19:22 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జీవో 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని  నిర్ణయించినట్టు తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకేచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు. దీంతో.. తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు వారి అభ్యర్థనను పరిశీలించి.. ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా  ఉమ్మడి జిల్లాలోని సర్వీసు పాయింట్లను కూడా జత చేసి, వాటి ఆధారంగా బదిలీలకు సంబంధించి అనుమతివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులపై ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 59వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ ధరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు