Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సుప్రీం నో..!

Same Sex Marriage: స్వలింగ సంపర్కుల వివాహానికి తాను చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే వారి హక్కులను కాపాడాలని ప్రభుత్వాలకు సూచించింది.

Updated : 17 Oct 2023 15:08 IST

Same Sex Marriage | దిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. అలాగే, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే, స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది.

పార్లమెంటే నిర్ణయించాలి..

‘‘ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్క జంటలు చేసుకునే వివాహానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఈ వివాహాలకు మేం హక్కులను కల్పించలేం. అది తమ ప్రాథమిక హక్కు అని స్వలింగ సంపర్కులు పేర్కొనకూడదు. ఈ వివాహాలను గుర్తించేలా చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

దత్తతపై కుదరని ఏకాభిప్రాయం 

స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత చేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై 3:2 మెజార్టీతో తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌.. దత్తతకు అనుకూలంగా.. జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ వ్యతిరేకంగా తీర్పులను వెలువరించారు. అయితే, కేవలం భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులను చట్టం భావించట్లేదని సీజేఐ ఈ సందర్భంగా వెల్లడించారు.

వారిపై వివక్ష వద్దు..: సీజేఐ

స్వలింగ సంపర్క జంటల వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. వారి హక్కులను మాత్రం పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  ‘‘స్వలింగ సంపర్కులపై సమాజంలో ఎలాంటి వివక్ష చూపొద్దు. వారికి హక్కులను కల్పించాలి. వారి సహజీవనంపై ఫిర్యాదులు వస్తే.. కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలి. వారి లైంగికత్వంపై విచారించేందుకు సమన్లు జారీ చేసి పోలీసులు వేధింపులకు గురిచేయకూడదు. అలాంటి వారు హార్మోనల్‌ థెరపీలు చేయించుకోవాలని కుటుంబసభ్యులు బలవంతపెట్టొద్దు’’ అని సీజేఐ సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని