Space: అంతరిక్ష విమాన ప్రయోగం దిగ్విజయం

సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రకు అవకాశం కల్పించేలా అమెరికాలోని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ కీలక ప్రయోగం చేపట్టింది. రాకెట్‌ తరహా విమానాన్ని శనివారం విజయవంతంగా ప్రయోగించింది.

Updated : 24 May 2021 08:48 IST

రోదసి పర్యాటకానికి మార్గం సుగమం

వాషింగ్టన్‌: సాధారణ పౌరుల అంతరిక్ష యాత్రకు అవకాశం కల్పించేలా అమెరికాలోని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ కీలక ప్రయోగం చేపట్టింది. రాకెట్‌ తరహా విమానాన్ని శనివారం విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ఇద్దరు పైలట్లు అంతరిక్షానికి చేరుకున్నారు.
‘వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అనే ఈ అంతరిక్ష విమానం.. పర్యాటకులను భూ వాతావరణపు అంచులకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగంలో ఈ విమానాన్ని ‘వీఎంఎస్‌ ఈవ్‌’ అనే వాహకనౌకకు అనుసంధానించారు. దీన్ని న్యూ మెక్సికో నుంచి నింగిలోకి పంపారు. కొద్దిసేపటికి.. ఈవ్‌ నుంచి పైలట్లు సి.జె.స్టుర్కోవ్‌, డేవ్‌ మెక్‌కేలతో కూడిన యూనిటీ విడిపోయింది. వెంటనే పైలట్లు యూనిటీలోని రాకెట్‌ను ఆన్‌ చేశారు. కొద్ది నిమిషాల తర్వాత దాన్ని నిలిపివేశారు. అయినా ఆ విమాన ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో అది 55.5 మైళ్ల ఎత్తులో అంతరిక్షానికి చేరుకుంది. ధ్వని కన్నా మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించింది. గంటన్నర తర్వాత అది తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. గ్లైడర్‌లా విహరిస్తూ నేలపై క్షేమంగా ల్యాండ్‌ అయింది. ఈ యాత్రలో అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు చెందిన కొన్ని పరిశోధక సాధనాలనూ రోదసిలోకి పంపామని వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ తెలిపారు. తాజా ప్రయోగం విజయవంతంగా సాగిందని, దీనికి సంబంధించిన డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తామని పేర్కొన్నారు. మరికొన్ని నెలలపాటు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ఈ అంతరిక్ష విమానం ద్వారా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని వర్జిన్‌ గెలాక్టిక్‌ భావిస్తోంది. ఈ పరీక్షల్లో భాగంగా బ్రాన్సన్‌ కూడా ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి వెళ్లి వస్తారు. ఇంతకుముందు రెండు సార్లు వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ ఈ స్పేస్‌ప్లేన్‌ను పరీక్షించింది. ఇది పూర్తిస్థాయిలో సిద్ధమైతే రోదసిలోకి వెళ్లేందుకు దాదాపు 600 మంది ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నారు. వీరిలో అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒక్కొక్కరు 2.5లక్షల డాలర్లు చెల్లించాల్సి రావొచ్చు. యూనిటీలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు పర్యాటకులు ప్రయాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని