CJI: తండ్రి వారించినా.. పట్టుదలతో లేఖ రాసింది!

తండ్రి వారించినా పట్టుదలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపిన కేరళ చిన్నారి లిడ్వినా జోసెఫ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది.

Updated : 10 Jun 2021 07:16 IST

శభాష్‌ అనిపించుకుంటున్న చిన్నారి లిడ్వినా

ఈనాడు, దిల్లీ: తండ్రి వారించినా పట్టుదలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపిన కేరళ చిన్నారి లిడ్వినా జోసెఫ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా పత్రికల్లో పతాక శీర్షికలకెక్కింది. రోజూ పత్రిక చదివే అలవాటున్న ఆమెను దిల్లీలో కరోనా ఉద్ధృతి కారణంగా రోగులు పడుతున్న అవస్థలు కదిలించాయి. ఆక్సిజన్‌ కోసం అల్లాడుతున్న జనం.. అంత్యక్రియలు నిర్వహించడానికి పేర్చిన శవాలను చూసి చలించిపోయిన ఆమె ఎందుకలా జరుగుతోందని తన తండ్రి, భారత వాయుసేన విశ్రాంత ఉద్యోగి జోసెఫ్‌ను ఆరా తీసింది. మనం వాళ్లకు ఆక్సిజన్‌ అందించలేమా? అని ఆవేదన చెందింది. అదే సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వేగంగా ఆక్సిజన్‌ అందించాలని ఉత్తర్వులు జారీ చేయడం.. తర్వాత పరిస్థితులు కుదుటపడి మరణాలు తగ్గడం చూసిన తన బిడ్డకు సుప్రీంకోర్టుపై గౌరవం పెరిగినట్లు జోసెఫ్‌ తెలిపారు. ధన్యవాదాలు చెబుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాయాలన్న కాంక్షను ఆమె తన తండ్రి వద్ద వ్యక్తం చేసింది. అయితే ఆయన వారించారు. ‘‘నువ్వు అయిదో తరగతి చదివే అమ్మాయివి.. అంత పెద్ద న్యాయమూర్తులకు ఏమని రాస్తావు?’’ అని ప్రశ్నించారు.  తొలుత నువ్వు ఏం రాయాలనుకుంటున్నావో రాసి చూపించమని సూచించారు. దీంతో లిడ్వినా జోసెఫ్‌ తన మనసులోని భావాలను కాగితంపై పెట్టి తండ్రికి చూపించింది. ఓ చిన్నారి సుప్రీంకోర్టుకు లేఖ రాస్తే ఏమనుకుంటారో.. అది ఎక్కడికి దారి తీస్తుందోనన్న భయంతో తండ్రి జోసెఫ్‌ వారించినా చివరకు అమ్మాయి పట్టుదల చూసి ఆ లేఖలోని చిన్నచిన్న తప్పులను సరిదిద్ది చివరకు లేఖను, డ్రాయింగ్‌ను కలిపి స్పీడ్‌పోస్టులో పంపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ దాన్ని మంచి స్ఫూర్తితో తీసుకొని అమ్మాయికి ప్రత్యుత్తరం రాయడంతో పాటు, బహుమతిగా రాజ్యాంగ ప్రతిని పంపడం పట్ల తండ్రి జోసెఫ్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని