దళిత బాలుడి మృతితో రాజస్థాన్లో ప్రకంపనలు
తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటన రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ దారుణోదంతంపై రాష్ట్ర
గహ్లోత్ సర్కారుకు తాఖీదు
జైపుర్, దిల్లీ: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటన రాజస్థాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ బారా-అత్రు ఎమ్మెల్యే పానాచంద్ మేఘ్వాల్ (కాంగ్రెస్) సోమవారం తన పదవికి రాజీనామా చేయగా.. ఆయనకు మద్దతుగా బారా మున్సిపల్ కౌన్సిల్లో హస్తం పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు తాజాగా రాజీనామా లేఖలు సమర్పించారు. జాలోర్ జిల్లా సురానా గ్రామంలోని ఓ పాఠశాలలో తాగునీటి కుండను తాకినందుకు గత నెల 20న టీచర్ చితకబాదడంతో ఇంద్రా మేఘ్వాల్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాంగ్రెస్ అగ్ర నేత సచిన్ పైలట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్సింగ్ దోస్తారా తదితర ప్రముఖులు తాజాగా బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.