
Subhas Chandra Bose: ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం: మోదీ
దిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విగ్రహం సిద్ధమయ్యేవరకు బోస్ హోలోగ్రామ్ను ఆ ప్రదేశంలో ఉంచనున్నారు. గతంలో ఇంగ్లండ్ రాజు జార్జ్-V విగ్రహం ఉన్న స్థానంలోనే ఇప్పుడు బోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. జార్జ్ విగ్రహాన్ని 1968లో అక్కడి నుంచి తరలించారు.
‘దేశమంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని జరుపుకొంటున్న తరుణంలో ఇండియా గేట్ వద్ద ఆయన గ్రానైట్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయన రుణం తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం. నేతాజీ భారీ విగ్రహం పూర్తయ్యేవరకు.. ఆయన హోలోగ్రామ్ను ఆ స్థానంలో ఉంచనున్నాం. జనవరి 23న దానిని ఆవిష్కరించనున్నాను’ అని మోదీ వరుస ట్వీట్లు చేశారు. బోస్ జయంతిని పురస్కరించుకొని జనవరి 23 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మామూలుగా అయితే జనవరి 24న ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. హోలోగ్రామ్ అంటే కాంతి కిరణాల ద్వారా ఏర్పడే త్రీ డైమెన్షల్ చిత్రం.