Kareena Kapoor: సైఫ్‌ అలీ ఖాన్‌ ఎక్కడున్నారో కరీనా కుటుంబం చెప్పట్లేదు..!

బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ కరోనా బారినపడటం అటు బీటౌన్‌లో.. ఇటు ముంబయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన

Published : 15 Dec 2021 01:44 IST

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు సహకరించడం లేదన్న బీఎంసీ అధికారులు

ముంబయి: బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ కరోనా బారినపడటం అటు బీటౌన్‌లో.. ఇటు ముంబయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు పాజిటివ్ అని తేలగానే అప్రమత్తమైన బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు వెంటనే నటి నివాసముంటున్న భవనాన్ని సీల్‌ చేశారు. అక్కడి వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. అయితే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విషయంలో కరీనా కుటుంబం తమకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సార్లు అడిగిన తర్వాత సైఫ్‌ అలీ ఖాన్‌ ముంబయిలో లేరన్న విషయాన్ని చెప్పారని, అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నది మాత్రం చెప్పట్లేదని అన్నారు. 

బాలీవుడ్‌ తారలు కరీనా కపూర్‌, అమృతా అరోడాకు సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇటీవల ముంబయిలో పలు పార్టీల్లో పాల్గొన్నారని బీఎంసీ అధికారులు ఆరోపించారు. ఈ తారలతో అనేకమంది కాంటాక్టు కావడంతో మరింత మందికి కొవిడ్‌ వ్యాపించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం కరీనా నివశించే అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అధికారులు అక్కడి వారికి పరీక్షలు నిర్వహించారు.

అయితే ఆ సమయంలో కరీనా కుటుంబం అధికారులకు సరిగా సహకరించలేదని, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్‌ గురించి అడిగితే సమాధానం చెప్పలేదని బీఎంసీ వర్గాలు వెల్లడించాయి. పదేపదే ప్రశ్నించిన తర్వాత.. గత వారం రోజుల నుంచి సైఫ్‌ ముంబయిలో లేరని చెప్పినట్లు పేర్కొన్నాయి. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు.. ఎప్పుడు వస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదని తెలిపాయి. ప్రస్తుతం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగుతోందని, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు కూడా చేస్తున్నామని సదరు వర్గాలు తెలిపాయి. 

కరణ్‌ జోహర్‌ పార్టీలో ఒకరికి తీవ్ర దగ్గు..

కరీనా, అమృత అరోడాతో పాటు కొంతమంది బీటౌన్‌ ప్రముఖులు ఈ నెల 8వ తేదీన కరణ్ జోహార్‌ ఇంట్లో డిన్నర్‌కు వెళ్లారు. ఆ తర్వాతే వీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వీరితో పాటు సీమా ఖాన్‌, మహీప్‌ కపూర్‌లకు కూడా కొవిడ్‌ సోకింది. ఈ పార్టీకి హాజరైన వారిలో కనీసం 12 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఒకరు దగ్గుతూ కన్పించారని, వారి నుంచే మిగతా వారికి వైరస్‌ సోకి ఉంటుందని కరీనా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. 

కరీనా నిబంధనలు ఉల్లంఘించారంటూ వస్తోన్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ‘‘కరీనా ఎల్లప్పుడూ చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అలాగే ఉన్నారు. బయటకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడామె కరోనా బారినపడ్డారు. నిజానికి ఆమె హాజరైన పార్టీ మీడియాలో వస్తున్నట్లుగా చాలా పెద్దది కాదు. కొద్ది మంది స్నేహితులు కలిసి చేసిన డిన్నర్‌ మాత్రమే. అయితే ఆ పార్టీలో ఓ వ్యక్తి అనారోగ్యంగా, దగ్గుతూ కన్పించారు. ఆ వ్యక్తి డిన్నర్‌కు రాకుండా ఉండాల్సింది. కరోనా వచ్చిందని తెలియగానే కరీనా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆమె బాధ్యతాయుతమైన పౌరురాలు’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని