45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్‌ హామీ ఏమైంది?

45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్‌ ఇస్తానని ప్రతిపక్షంలో ఉండగా సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.

Published : 10 Jun 2023 03:46 IST

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్‌ ఇస్తానని ప్రతిపక్షంలో ఉండగా సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి అమ్మఒడి వర్తింపజేస్తామని భారతిరెడ్డితో కల్లబొల్లి మాటలు చెప్పించి, సంపూర్ణ మద్యపాన నిషేధం అని మహిళల్ని వంచించారని ఆమె మండిపడ్డారు. అధికారం కోసం ఎడాపెడా హామీలిచ్చిన జగన్‌.. సీఎం కాగానే వాటిని చెత్తబుట్టలో పడేశారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి వీల్లేకుండా మహిళలు సీఎం సభల్లో మగ్గిపోతుంటే.. రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించదా? హనుమాయమ్మ అనే ఎస్సీ మహిళను వైకాపా నేత కిరాతకంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపితే పట్టించుకోదా? తాడేపల్లి నుంచి స్క్రిప్ట్‌ వస్తేనే హోంమంత్రి మాట్లాడతారు. మహిళల్ని ఆదుకోవడానికి చంద్రబాబు మహిళాశక్తి పేరుతో పథకాలు ప్రకటించారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని