ప్రధానితో భేటీకి ఆహ్వానం అందింది: ఒమర్‌ 

ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారని, ఈ భేటీకి తమకు ఆహ్వానం అందినట్టు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత....

Published : 20 Jun 2021 01:33 IST

శ్రీనగర్‌: ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానం అందినట్టు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కశ్మీర్‌లోని మరో ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉన్న పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కూడా రేపు సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే, అఖిల పక్షసమావేశంపై ఆమె స్పందిస్తూ.. జూన్‌ 24న సమావేశం ఉన్నట్టు తనకు ఫోన్‌ వచ్చినట్టు తెలిపారు.  నేడో, రేపో తనకు అధికారిక ఆహ్వానం వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. 

ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌, కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో పాటు భద్రతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని