Revanth Reddy: పసుపుబోర్డు తెస్తామని.. బోర్డు తిప్పేశారు: రేవంత్‌రెడ్డి

ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Updated : 12 Mar 2023 00:01 IST

కోరుట్ల: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని, పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. బోర్డు తిప్పేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రేవంత్‌ విమర్శించారు.  ఆయన  చేపట్టిన ‘హాథ్‌ సే హాత్‌ జోడో యాత్ర (Hath Se Hath Jodo Yatra) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  శనివారం రాత్రి  ముగిసింది. ఈ సందర్భంగా కోరుట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? ఈ ప్రాంత పసుపు రైతుల కష్టాలు తీరాయా?’ అని ఆయన ప్రశ్నించారు. ఎకరాకు రూ.1.50లక్షలు పెట్టుబడి పెట్టిన పసుపు రైతులకు ఆత్మహత్యలే  దిక్కవుతున్నాయన్నారు. ఆనాడు ఈ ప్రాంతంలో రత్నాకర్‌రావు చేసిన అభివృద్ధే తప్ప భారాస ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

 ‘‘ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకొంటున్న కేసీఆర్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేసీఆర్‌ను అసదుద్దీన్‌ ఎందుకు ప్రశ్నించరు? అసద్‌ ఓటేయమని ప్రజలను అడగడం బాగానే ఉంది కానీ, కేసీఆర్‌ను మోదీ ముందు మోకరిల్లొద్దని ఎందుకు చెప్పడం లేదు. మోదీని వ్యతిరేకిస్తున్న మా వైపు ఎందుకు రావట్లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి.’’ అని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని