IND vs SA: సిరాజ్‌ స్థానంలో ఎవరు?

రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. వాండరర్స్‌ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. తొడ కండరాల

Updated : 09 Jan 2022 06:58 IST

దిల్లీ: రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. వాండరర్స్‌ మైదానంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు కేవలం 15.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు మూడో టెస్టుకు దాదాపుగా దూరమైనట్లే. కోచ్‌ ద్రవిడ్‌ కూడా అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేమని అన్నాడు. నిర్ణయాత్మక టెస్టుకు అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదే ఇప్పుడు భారత జట్టు ముందున్న ప్రశ్న.

సిరాజ్‌ అందుబాటులో లేకుంటే అతను ఖాళీ చేసే స్థానం కోసం ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు. 100కు పైగా టెస్టులాడిన 33 ఏళ్ల ఇషాంత్‌ ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేడు. 51 టెస్టులు ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ ఈ మధ్య ఇషాంత్‌ కన్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ ద్రవిడ్‌ ఇషాంత్‌ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి అతడి ఎత్తు. 6 అడుగుల మూడున్నర అంగుళాల ఇషాంత్‌.. ఇబ్బందికర లెంగ్త్‌లతో బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించగలడని భావిస్తున్నారు. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్లు జాన్సన్‌, అలివీర్‌ అదే చేశారు. ‘‘వాండరర్స్‌లో బంతి అస్థిరంగా బౌన్సయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. అది వారి ఎత్తు వల్ల కావొచ్చు. ఒక బంతి ఎక్కువ, ఒక బంతి తక్కువగా లేచే పిచ్‌పై అదనపు ఎత్తు బౌలర్‌కు లాభించవచ్చు. వాళ్లంతగా అస్థిర బౌన్స్‌ మన బౌలర్లకు లభించలేదనిపించింది’’ అని కోచ్‌ ద్రవిడ్‌ చెప్పాడు. సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా ఇషాంత్‌నే తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ‘‘పొడవాటి ఫాస్ట్‌ బౌలర్‌ లేకపోవడం రెండో టెస్టులో మనకు ప్రతికూలాంశమైంది. అలా మనకున్న ఏకైక పేసర్‌ ఇషాంత్‌. ఇలాంటి పిచ్‌లపై ఉమేశ్‌ కంటే అతణ్ని తీసుకుంటేనే మంచిదన్నది నా అభిప్రాయం. భారత పిచ్‌లపై అయితే ఉమేశ్‌ను ఆడించవచ్చు’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని