
7.64 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఈనాడు, హైదరాబాద్: ఈ యాసంగిలో బుధవారం నాటికి 7.64 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికిచ్చిన తాజా నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 22.32 లక్షల ఎకరాల్లో దీన్ని వేశారు. వరి సాగు వద్దని, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనేది లేదని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసినా ఇప్పటికే 7.64 లక్షల ఎకరాల్లో ఈ నాట్లు వేయడం గమనార్హం. గతేడాది ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 52 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవగా ఈసారి అందులో సగానికి సగం తగ్గించాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాసంగిలో అన్ని రకాలూ కలిపి ఇప్పటికి 23.72 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉంది. 19.07 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. వరి సాధారణ విస్తీర్ణం 12.56 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.76 లక్షల ఎకరాలు కాగా, ఈ రెండు పంటలు అంతకంటే తక్కువగానే సాగయ్యాయి. పెసర కూడా అదే పరిస్థితి. పప్పుధాన్యాల సాగు సాధారణంకన్నా 21 శాతం పెరిగింది. నూనెగింజల పంటల సాగు 3 శాతం తగ్గింది. శనగ, వేరుసెనగ, మినుము సాగు పెరిగింది.