China: మా దేశం నుంచి వెళ్లిపోండి.. భారత జర్నలిస్టుకు చైనా ఆదేశం

చైనాలో (China) విధులు నిర్వహిస్తోన్న భారత జర్నలిస్టును (Journalist) తమ దేశం నుంచి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు తాజాగా సూచించారు. దీంతో చైనాలో భారత మీడియాకు సంబంధించి ఏ ఒక్క ప్రతినిధి కూడా ఉండనట్లే.

Published : 12 Jun 2023 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దు విషయంలో భారత్‌-చైనాల (India-China) మధ్య కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జర్నలిస్టుల (Journalist visa) విషయంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడనున్నట్లు కనిపిస్తోంది. చైనాలో విధులు నిర్వహిస్తోన్న చివరి భారత జర్నలిస్టును తమ దేశం నుంచి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు తాజాగా సూచించారు. ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది.

చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్‌ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రసార భారతితోపాటు పలు వార్తాపత్రికల ప్రతినిధులు ఇటీవలే భారత్‌కు వచ్చేశారు. కేవలం పీటీఐ వార్తాసంస్థ ప్రతినిధి మాత్రమే ప్రస్తుతం అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఆయన్ను కూడా ఈ నెల చివరి వరకు దేశం విడిచి వెళ్లాలని అక్కడి అధికారులు ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా పరిమితి విధిస్తోంది. కానీ, భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు అటువంటి పరిమితులు ఏమీ లేవు. ఈ క్రమంలో చైనాలో పనిచేస్తున్న భారత జర్నలిస్టులు తమకు సహాయంగా ఉండేందుకుగాను అసిస్టెంట్లు నియమించుకోవాలని ప్రయత్నించారు. వీటిని తిరస్కరించిన చైనా.. తమ దేశానికి చెందిన ఇద్దరు మీడియా ప్రతినిధుల వీసాను భారత్‌ తిరస్కరించిందని ఆరోపించింది. దీంతో ఈ వీసా వివాదం మొదలైంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ.. చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని పేర్కొంది. ఇదిలాఉంటే, ప్రస్తుతం భారత్‌లో పనిచేస్తున్న ఒక చైనా జర్నలిస్టు రెన్యూవల్‌ మాత్రం పెండింగులో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు