
తెలంగాణ
సింగరేణి కోసం ఇంధనశాఖ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: బొగ్గుగనుల తవ్వకానికి ‘అత్యవసరం’ అంటూ 873 ఎకరాల భూసేకరణకు సింగరేణి సంస్థకు అనుమతినిస్తూ ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జయశంకర్ జిల్లా ఘన్పూర్ మండలం ధర్మారావుపేట, కొండాపూర్లలో, భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామాలలో ప్రత్యేకంగా భూములు సేకరించేందుకు అనుమతినిచ్చినట్లు తెలిపింది. ఈ రూపేణా ఏటా 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింగరేణి సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. వీటికి సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్కేంద్రానికి బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నందున ఈ భూముల సేకరణ అత్యవసరమని వివరించింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ చట్టం పరిధిలోని సామాజిక అధ్యయనం నుంచి ప్రక్రియకు మినహాయింపునిచ్చినట్లు సర్కారు పేర్కొంది. అత్యవసరంగా భూములు సేకరించేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.