‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌ మీరేనా? ఫహద్‌ సమాధానం ఇదే!

తన పారితోషికం గురించి నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 09 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళంలో వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil). అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ (sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప: ది రైజ్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తొలి భాగంలో భన్వర్‌సింగ్‌ షెకావత్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం సిద్ధమవుతోన్న ‘పుష్ప2’ (pushpa 2)లో ఆయన పాత్ర మరింత విస్తృతంగా ఉండనుంది. ముఖ్యంగా పుష్పరాజ్‌, భన్వర్‌సింగ్‌ల మధ్య సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లు ఉంటాయని టాలీవుడ్‌ టాక్‌. ఈక్రమంలో ఫహద్‌ ఫాజిల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప 2’ తర్వాత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌ మీరేనంటున్నారు దీనిపై ఏమంటారు? అని ప్రశ్నించగా, ఫహద్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు

‘‘దేనికైనా డబ్బు అనేది ఒక కారణం. కానీ, అదొక్కటే కాదు కదా! నేను ఇంటినుంచి బయటకు వచ్చి చేసే పని ఏదైనా నాలో ఉత్సాహం నింపేదిగా ఉండాలి. సుకుమార్‌ సర్‌తో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. భన్వర్‌సింగ్‌ పాత్రకు ఎవరైతే సరిపోతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నా. మేమంతా కలిసి ఒక భారీ ఇండియన్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ చేస్తున్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను సినిమా సెట్‌కు వెళ్తాను.  ‘పుష్ప’ టీమ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేనూ ఎంతో ఆస్వాదిస్తా. కానీ, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్‌ను అవుతానో, లేదో మాత్రం నాకు తెలియదు. కేవలం డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదు. ‘కుంబలంగి నైట్స్‌’, ‘ట్రాన్స్‌’ చిత్రాలతో చాలానే సంపాదించా. నటన ద్వారా డబ్బులు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చా. ఇది అనిశ్చితి కలిగిన వ్యాపారం. ఆర్థిక అస్థిరత్వాన్ని నేను సమర్థంగా ఎదుర్కోగలను. కేవలం రెండు సినిమాలు చేసి వెళ్లిపోవాలనుకున్నా. ఆ తర్వాత వచ్చినందతా బోనసే’’ అని ఫహద్‌ ఫాజిల్‌ అన్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరపుకొంటున్న ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. రష్మిక కథానాయిక. సునీల్‌, అనసూయ, ధనుంజయ అజయ్‌, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలిభాగంతో పోలిస్తే, అదిరిపోయే మాస్‌ ఎలిమెంట్స్‌తో మూవీని తీర్చిదిద్దుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘పుష్ప.. పుష్ప’ సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు