డిగ్రీతో డిఫెన్స్లోకి!
భారతదేశ రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు రాయాల్సిన పరీక్ష కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ). దీన్ని డిగ్రీ అర్హతతో ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇందులో విజయం సాధించినవారు ఆర్మీ/ నేవీ/ ఏర్ఫోర్స్లో అధికారి హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వీరికి ఆకర్షణీయ వేతనాలతోపాటు ప్రోత్సాహకాలూ దక్కుతాయి. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!
సీడీఎస్ఈలో నెగ్గితే సరి
పైలట్ కల నెరవేర్చే పరీక్ష
భారతదేశ రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు రాయాల్సిన పరీక్ష కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ). దీన్ని డిగ్రీ అర్హతతో ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలు చేపడతారు. ఇందులో విజయం సాధించినవారు ఆర్మీ/ నేవీ/ ఏర్ఫోర్స్లో అధికారి హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వీరికి ఆకర్షణీయ వేతనాలతోపాటు ప్రోత్సాహకాలూ దక్కుతాయి. తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!
దేశ రక్షణలో భాగమై, ఉన్నతోద్యోగంలో స్థిరపడాలని ఆశించే యువతకు సీడీఎస్ఈ మేటి అవకాశం. ఎంపికైనవారు నేరుగా అధికారి హోదా (లెవెల్ 10 పే) పొందవచ్చు. ప్రత్యక్ష నియామకాల ద్వారా ఇంతకంటే పెద్ద ఉద్యోగంలోకి చేరడం సాధ్యం కాదు. ఎంపికైనవారు భవిష్యత్తులో ఆర్మీ/ నేవీ/ ఏర్ఫోర్స్కు చీఫ్ కావడానికీ అవకాశం ఉంది.
పైలట్ కావాలని ఆశించేవారు సీడీఎస్ఈతో తమ కల పైసా ఖర్చు లేకుండా నెరవేర్చుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసుకున్న 24 ఏళ్లలోపువారు ఎవరైనా ఈ పరీక్షకు పోటీ పడవచ్చు. ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నందువల్ల సీడీఎస్ఈని లక్ష్యంగా చేసుకున్నవారు తప్పకుండా విజయం సాధించవచ్చు. గత నియామకాలను పరిశీలిస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో 45 శాతం మార్కులు పొందినవారు తప్పనిసరిగా ఏదో ఒక సర్వీస్కు ఎంపికవుతున్నారు.
రాతపరీక్షలో...
ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఒక్కో పేపర్ వంద మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్ పూర్తిచేయడానికి 2 గంటల వ్యవధి ఉంటుంది. మ్యాథ్స్లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకూ దానికి కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్ విభాగం మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి పేపర్ 1లో 20, 2లో 10, 3లో 20 శాతం మార్కులు తప్పనిసరి. ఒక్క ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.
ఏం చేయాలి?
* మ్యాథ్స్కు సంబంధించి సిలబస్లో పేర్కొన్న అధ్యాయాల కోసం 8, 9, 10 తరగతుల గణితం పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. గణితం నేపథ్యం ఉన్నవారు ఈ పేపర్ను సులువుగానే ఎదుర్కోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు ఈ విభాగంలో మెరుగైన మార్కులకు అదనపు సమయం కేటాయించడం తప్పనిసరి. వీరు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
* జనరల్ నాలెడ్జ్ పేపర్కు సంబంధించి... భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. లూసెంట్ లేదా అరిహంత్ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి.
* ఇంగ్లిష్ విభాగం ప్రశ్నలన్నీ హైస్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8, 9, 10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి.
ప్రాథమిక స్థాయి సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ప్రశ్నల తీరు తెలుస్తుంది. దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన పెరుగుతుంది. సన్నద్ధత ఎలా ఉండాలో అర్థమవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
విద్యార్హత
మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఏర్ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
వయసు: జులై 1, 2022 నాటికి 20-24 ఏళ్లలోపు ఉండాలి. ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జులై 2, 1998 కంటే ముందు; జులై 1, 2003 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏర్ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జులై 2, 1998 కంటే ముందు, జులై 1, 2002 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జులై 2, 1997 కంటే ముందు, జులై 1, 2003 తర్వాత జన్మించినవారు అనర్హులు.
* మొత్తం ఖాళీలు: 339. విభాగాల వారీ ఐఎంఏ-100, ఐఎన్ఏ-22, ఏఎఫ్ఏ-32, ఓటీఏ ఎస్ఎస్సీ మెన్, నాన్ టెక్నికల్ -169, ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్ 16.
* ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 24 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
* పరీక్ష తేది: నవంబరు 14
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి
https://upsc.gov.in/
2020 సీడీఎస్ఈ (1) కటాఫ్ ఇలా..
రాత పరీక్ష: ఐఎంఏ 130, ఐఎన్ఏ 118, ఏఎఫ్ఏ 143, ఓటీఏ 93 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ): ఐఎంఏ 250, ఐఎన్ఏ 242, ఏఎఫ్ఏ 274, ఓటీఏ 173 (మెన్) 177 (ఉమెన్)
శిక్షణ
అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏర్ఫోర్స్, ఓటీఏ వీటిలో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ చేపడతారు. ఏర్ఫోర్స్ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ నిర్వహిస్తారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారికి చెన్నైలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. వీరికి మద్రాస్ విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
ఉద్యోగంలో...
శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఏర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) ఉన్న ఉద్యోగాలే. వీరికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్ అలవెన్స్ అందుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలు .. అన్నీ కలుపుకుని మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. వీరు కేవలం రెండేళ్ల సర్వీస్తో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఏర్ఫోర్స్లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ హోదాలు సొంతం చేసుకోవచ్చు.
ఆరేళ్లపాటు విధుల్లో కొనసాగితే మేజర్/ లెఫ్టినెంట్ కమాండర్/ స్క్వాడ్రన్ లీడర్ గుర్తింపు లభిస్తుంది. 13 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు ఏర్ఫోర్సులో వింగ్ కమాండర్ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందవచ్చు.
ఈ అంశాల్లో...
ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఈ విభాగంలో అడిగే లెక్కల ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. ప్రాథమిక గణితం అంటే..అరిథ్మెటిక్ (నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. కాంప్రహెన్షన్, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ సెంటెన్సెస్, సెంటెన్స్ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్... నుంచి ప్రశ్నలు సంధిస్తారు.
జనరల్ నాలెడ్జ్: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూ
ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కీలకం. పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులు కేటాయించారు. ఒక్క ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. అయిదు రోజులపాటు కొనసాగే ఇంటర్వ్యూ మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో దశకు అనుమతిస్తారు.స్టేజ్-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.