పీఆర్సీ వ్యాజ్యం మరోసారి సీజే నిర్ణయానికి

వేతన సవరణ (పీఆర్సీ) జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏ ధర్మాసనం విచారణ జరపాలనే విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

Published : 29 Jan 2022 03:15 IST

ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాలన్న ఏజీ

ఈనాడు, అమరావతి: వేతన సవరణ (పీఆర్సీ) జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏ ధర్మాసనం విచారణ జరపాలనే విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ వ్యాజ్యం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి వద్దకు విచారణకు వచ్చింది. వాదనల ప్రారంభ సమయంలో ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ.. రిట్‌ నిబంధన 14(ఏ)(6) ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాలన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యం ఏ బెంచ్‌ వద్దకు విచారణకు రావాలో పరిపాలనపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఫైలును సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

జీతం తగ్గుతోంది: పిటిషనర్‌ కేవీ కృష్ణయ్య ప్రధాన వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్‌ వేశారు. పీఆర్సీ వల్ల తనకు జీతంలో రూ.6072 తగ్గుతోందన్నారు. 2015 పీఆర్సీ, 2022 పీఆర్సీ ఆధారంగా ఎంత జీతం వస్తోందో గణాంకాలను పేర్కొన్నారు. 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏఆధారంగా వచ్చే జీతాన్ని ప్రస్తావించారు.


ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసుపై హైకోర్టులో పిల్‌

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఆ నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ విశాఖకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ ఎన్‌.సాంబశివరావు శుక్రవారం ఈ వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం రాజ్యాంగ విరుద్ధమని, సర్వీసు నిబంధనలకు వ్యతిరేకం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, పీఆర్సీ పోరాట కమిటీ, ఏపీ ఎన్‌జీవో సంఘం ప్రధాన కార్యదర్శి, తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని