బ్యాంకులూ.. జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ జాతీయ బ్యాంకులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)తోపాటు ఇతర కార్పొరేషన్‌లకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం సంక్లిష్టమైంది. రుణాలిచ్చేందుకు అంగీకరించి, ఒప్పందాలు కుదుర్చుకుని, తనఖా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన ఏపీఎస్‌డీసీ అప్పు విషయంలోనూ బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి.

Updated : 15 Feb 2022 06:14 IST

ఏపీఎస్‌డీసీ వ్యవహారం వివాదాస్పదం కావడంతో అప్రమత్తం చేసిన కేంద్రం
తాఖీదు ఉపసంహరించుకోవాలని రాష్ట్రం వినతులు
ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సీఎం
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ జాతీయ బ్యాంకులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ)తోపాటు ఇతర కార్పొరేషన్‌లకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం సంక్లిష్టమైంది. రుణాలిచ్చేందుకు అంగీకరించి, ఒప్పందాలు కుదుర్చుకుని, తనఖా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన ఏపీఎస్‌డీసీ అప్పు విషయంలోనూ బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. కార్పొరేషన్లన్నీ ప్రభుత్వ గ్యారంటీలతోనే రుణాలు పొందుతున్నాయి. ప్రజలపై అదనపు సుంకాలు, పన్నులను విధించి... తద్వారా సముపార్జించే ఆదాయంతోనే బ్యాంకుల అప్పులను తీర్చేలా ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసింది. తాజా పరిణామంతో ఈ విధానానికి అవాంతరం ఏర్పడింది. ఎస్‌బీఐ నుంచి ఏపీఎస్‌డీసీకి చివరి విడతగా రూ.1,800 కోట్లు రావాల్సి ఉండగా ఆగిపోయినట్లు తెలిసింది. బేవరేజెస్‌, ఇతర కార్పొరేషన్లు సేకరించాలనుకుంటున్న రూ.వేల కోట్ల అప్పులకూ ఇలాగే అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం జనవరి నెల కన్నా ముందే చోటు చేసుకున్నా... అధికారికంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కారణంతోనే జాతీయ బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని తెలిసింది. పైగా ఏపీఎస్‌డీసీ నమూనాలో ఇతర కార్పొరేషన్లు రుణాలకు ప్రయత్నిస్తోంటే అందులో న్యాయబద్ధత ఎంత ఉందని కూడా ప్రశ్నిస్తున్నాయి.

ఇదీ ఏపీఎస్‌డీసీ నమూనా: రాష్ట్రంలోని వివిధ అవసరాల నిమిత్తం రుణాలను తీసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీఎస్‌డీసీని ఏర్పాటు చేసింది. ఎస్‌బీఐ క్యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం రుణ మొత్తానికి గ్యారంటీలు ఇచ్చింది. 2020-21 సంవత్సరంలో రూ.25 వేల కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకుల కన్షార్షియంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.6,000 కోట్లు) యూనియన్‌ బ్యాంకు (రూ.5,000 కోట్లు) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(5,000 కోట్లు) ఇండియన్‌ బ్యాంకు(2,500 కోట్లు), బ్యాంకు ఆఫ్‌ బరోడా(రూ.3500 కోట్లు), బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర (రూ.1,000 కోట్లు) ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు (రూ.1,250 కోట్లు) పంజాబ్‌ సింద్‌ బ్యాంకు (రూ.750 కోట్లు) రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. కేవలం గ్యారంటీలు చాలవని బ్యాంకులుపేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం అదనపు రిటైల్‌ ఎక్సయిజ్‌ సుంకం విధించి... తద్వారా వచ్చే మొత్తంలో కొన్ని మద్యం డిపోల ఆదాయాన్ని ప్రతినెలా బ్యాంకులకు రుణం చెల్లించేందుకు అనువుగా ఎస్క్రో చేసింది. ఇది కూడా చాలదని విశాఖలోని రూ.2,954 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టింది.

ఏపీఎస్‌డీసీ నమూనాపై అభ్యంతరాలు..: భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం ఏమేరకు సబబు అని ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఏకంగా ప్రధానికే ఫిర్యాదు చేశారు. దాంతో కేంద్ర ఆర్థికశాఖ పరిశీలించి, ఆంధ్రప్రదేశ్‌ను వివరణ కోరింది.

ప్రధాని దృష్టికీ తీసుకెళ్లిన సీఎం: రుణాలు పుట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆర్థికశాఖతో రాష్ట్ర అధికారులు మంతనాలు జరపడంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌ కూడా ప్రధాని దృష్టికి విషయం తీసుకువెళ్లారు. రుణాలు ఇచ్చేవారంతా ఆందోళన చెందడంతో వారి వినతి మేరకు ఏపీఎస్‌డీసీ రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం తీసుకుందని జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ గతంలో ఇదే నమూనాలో రుణాలు తీసుకుందని ప్రధానికి వివరించారు. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్‌ మిశ్రను సంప్రదించగా ఏపీఎస్‌డీసీ నమూనాలో రుణాలు తీసుకోవడం రాజ్యాంగ బద్ధమేనని, లీగాలిటీ ఉన్నదే అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీఎం ప్రధానికి వివరించారు.

ఏపీ వాదనతో విబేధిస్తున్న ఆర్థిక నిపుణులు: జాతీయ రహదారుల సంస్థ నమూనాకు, రాష్ట్రంలోని ఏపీఎస్‌డీసీ నమూనాకు తేడా ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రహదారుల సంస్థ నమూనాలో సేకరిస్తున్న నిధులతో ఆస్తులు సృష్టిస్తున్నారని- ఏపీఎస్‌డీసీ నిధులను మానవ మూలధనంగా వెచ్చిస్తున్నారని దీనివల్ల ఫలితాలు, ప్రయోజనాలు ఎప్పటికి అందుతాయో అంచనా వేయడం కష్టమని పేర్కొంటున్నారు. ఏపీఎస్‌డీసీ నమూనాలో ఆస్తుల కల్పన లేనందున ఇలా అప్పులపై అప్పులు చేయాల్సి ఉంటుందని, దానివల్ల రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోతుందని విశ్రాంత ఆర్థికశాఖ అధికారులు కొందరు హెచ్చరిస్తున్నారు.


భవిష్యత్తు ఆదాయాన్ని చూపడమేంటి?
భవిష్యత్తు ఆదాయాన్ని ఇలా ఎస్క్రో చేయడం రాజ్యాంగంలోని 266(1)కి అనుగుణంగా లేదని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ వ్యవహారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)కి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. ఆ తదనంతర పరిణామాల్లో ఏపీఎస్‌డీసీకి అసలు రుణాలే ఇవ్వకూడదంటూ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలిచ్చే సందర్భంలో బహు జాగ్రత్తగా ఉండి, అన్నీ పరిశీలించుకుని మాత్రమే ఇవ్వాలని జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని