చెత్త పన్ను చెల్లిస్తేనే ‘చేయూత’!

చెత్త సేకరణ రుసుములు చెల్లిస్తేనే డ్వాక్రా సంఘాల మహిళలకు చేయూత పథకం వర్తిస్తుందని విశాఖలో ఆర్పీలు (రిసోర్స్‌ పర్సన్లు) వాట్సప్‌ వాయిస్‌ మేసేజ్‌లు

Published : 14 Aug 2022 02:21 IST

డ్వాక్రా సంఘాలకు ఆర్పీల వాయిస్‌ మేసేజ్‌లు

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: చెత్త సేకరణ రుసుములు చెల్లిస్తేనే డ్వాక్రా సంఘాల మహిళలకు చేయూత పథకం వర్తిస్తుందని విశాఖలో ఆర్పీలు (రిసోర్స్‌ పర్సన్లు) వాట్సప్‌ వాయిస్‌ మేసేజ్‌లు పంపడం కలకలం సృష్టించింది. 45-60 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద ఏడాదికి రూ.18,750 చెల్లిస్తోంది. లబ్ధిదారుల్లో 90శాతం వరకు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఆర్నెళ్ల చెత్త సేకరణ రుసుములు చెల్లించాలని అధికారులు డ్వాక్రా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు చేయూత పథకం వర్తించదని కొత్త నిబంధన తీసుకొచ్చారు. ‘అధికారులు మాకిచ్చిన సమాచారాన్ని మీకు చేరవేస్తున్నాం. చేయూత పథకం కావాలంటే ప్రతి ఒక్కరూ చెత్త పన్ను చెల్లించాలి’ అని ఆర్పీలు (రిసోర్స్‌ పర్సన్లు) శుక్రవారం డ్వాక్రా గ్రూపుల్లో వాట్సప్‌ వాయిస్‌ మేసేజ్‌ పంపించారు. దీనిపై మహా విశాఖ నగరపాలక సంస్థ యూసీడీ పీడీ పాపునాయుడుని వివరణ కోరగా.. రిసోర్స్‌ పర్సన్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న నేపథ్యంలో చెత్త సేకరణ ఛార్జీలు వసూలుచేసి ఆదర్శంగా నిలవాలని సూచించామన్నారు. ఛార్జీలు చెల్లించని వారికి చేయూత పథకం నిలిపివేయాలని తాము ఆదేశించలేదన్నారు. యథావిధిగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని