Tirumala: తిరుమలేశా.. కొండపై ఉండేదెలా?

ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1,700. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు రూ.2,200. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏ ప్రైవేటు హోటల్‌ యాజమాన్యమో ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే.

Updated : 12 Jan 2023 09:30 IST

తితిదే అతిథి గృహాల్లో భారీగా అద్దెల పెంపు
ప్రైవేటు లాడ్జీల తరహాలో పెరిగిన ధరలు
భక్తులపై లడ్డూ ధరల భారమూ అధికమే
ఆర్టీసీ ఛార్జీల మోత దీనికి అదనం

ఈనాడు, అమరావతి, తిరుపతి: ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1,700. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు రూ.2,200. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏ ప్రైవేటు హోటల్‌ యాజమాన్యమో ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కనులారా దర్శించుకోవాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వడ్డిస్తున్న ధరల వాతలివి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన తితిదే... వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తూ గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, తితిదే పాలకవర్గం.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై కాకుండా, వారి నుంచి డబ్బు పిండటంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన తితిదే... క్రమంగా తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాల్లో గదుల ధరల్నీ ప్రైవేటు హోటళ్ల తరహాలో పెంచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తితిదే ఒకానొక దశలో వివిధ ఆర్జిత సేవల ధరల్ని పెంచాలని ప్రయత్నించి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.

తితిదే పాలక మండలి సమావేశంలో... అధికారులు ఒక ధర చెబితే, దాన్ని ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మరిన్ని రెట్లు పెంచేస్తూ.... వేలంపాట పాడినట్టుగా శ్రీవారి సేవల టికెట్‌ ధరల్ని పెంచాలనుకున్న తీరు అప్పట్లో టీవీ ఛానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారమైంది. అది తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. దాంతో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై తితిదే వెనక్కి తగ్గింది. తర్వాత మరెప్పుడూ తితిదే పాలక మండలి సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. ఆ పరిణామంతో ఆర్జిత సేవల టికెట్ల పెంపు ప్రతిపాదనల్ని విరమించుకున్న తితిదే... గదుల అద్దెలు పెంచడం, భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించడం, ప్రసాదం ధరల పెంపు లాంటి చర్యలకు పాల్పడుతోంది.

ఆర్జితసేవా టికెట్ల ధరలు ఎంత పెంచినా సామాన్యులకు ఇబ్బంది లేదు. అవి కొనేవారిలో ఆర్థిక స్తోమత, పలుకుబడి గలవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ గదుల అద్దెల పెంపు భారం ఎక్కువగా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపైనే పడుతోంది. కావాలంటే ధనికులు ఉపయోగించే, ఎక్కువ సౌకర్యాలున్న అతిథి గృహాల్లో ధరలు పెంచి, సామాన్యులపై భారం లేకుండా చూడొచ్చు. సామాన్యులుండే అతిథి గృహాల్లో స్వల్పంగా పెంచినా ఇబ్బంది పడరు. 2022-23 సంవత్సరానికి తితిదే బడ్జెట్‌ రూ.3,096.40 కోట్లు. అంత భారీ బడ్జెట్‌ ఉన్న తితిదే... తలుచుకుంటే సామాన్య భక్తులపై భారం పడకుండా చూడలేదా? ఇలా అడ్డదిడ్డంగా పెంచడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఒకేసారి 1100 శాతానికిపైగా పెంచేస్తే ఎలా?

‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరల్ని నిర్ణయిస్తే దాని మీదా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవాళ్లకు వీళ్లు శత్రువులు కాదా.. సినిమా టికెట్ల ధరల్ని తగ్గించడాన్ని సమర్థించుకుంటూ ముఖ్యమంత్రి జగన్‌ గత ఏడాది జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చెప్పిన మాటలవి. పేదల వినోదంపైనే అంత శ్రద్ధ కనబరిస్తే.. ప్రజలంతా కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని మరింత సులువుగా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా సామాన్యులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను ఒక్కసారిగా రూ.150 నుంచి రూ.1,700కి పెంచడం ప్రజలపై పెనుభారం కాదా? ఒక్కసారిగా ధరల్ని 1133% పెంచడం ఎలా సమర్థనీయం? తిరుమలలోని అతిథి గృహాలు, కాటేజీల్లో వివిధ కేటగిరీల గదులు సుమారు 7,200 ఉన్నాయి. వాటిలో ఒక గదికి ఒకరోజు అద్దె... ఎస్‌ఎంసీ, ఎస్‌ఎన్‌సీ, ఏఎన్‌సీ, హెచ్‌వీసీల్లో రూ.50, రాంబగీచా, వరాహస్వామి గెస్ట్‌హౌస్‌, ఎస్‌ఎన్‌జీహెచ్‌, హెచ్‌వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో రూ.100, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌లలో రూ.150, విష్ణుపాదంలో రూ.250, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో రూ.500 చొప్పున ఉండేవి. ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాల ధరల్ని రూ.వెయ్యికి పెంచేశారు. ఎస్వీ అతిథి గృహంలో 31 గదులుండగా, వాటి అద్దెను రూ.150 నుంచి రూ.1700 చేశారు. ఇప్పుడు నాలుగు నారాయణగిరి అతిథి గృహాల్లోని 164 గదుల అద్దెలనూ పెంచేశారు.

లడ్డూ ధరల మోత

శ్రీవారికే కాదు భక్తులకూ కొండపై ప్రసాదంగా ఇచ్చే లడ్డూ అత్యంత ప్రీతిపాత్రం. వైకాపా అధికారంలోకి వచ్చాక... లడ్డూ ధరల్ని పెంచేసి, స్వామివారి ప్రసాదాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. గతంలో రూ.25 ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచింది. రూ.25 ఉన్న వడ ధరను నాలుగు రెట్లు పెంచేసి రూ.100 చేసింది. కల్యాణం లడ్డూధరను రూ.100 నుంచి రూ.200కి పెంచింది. ఇదివరకు కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ‘దివ్యదర్శనం’ సౌకర్యం ఉండేది. రోజుకు 20వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. వారికి ఉచితంగా ఒక లడ్డూ, దానికి అదనంగా రెండు లడ్డూలు రూ.10 చొప్పున, మరో రెండు లడ్డూలు రూ.25 చొప్పున అందజేసేవారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత లడ్డూతోపాటు, రూ.70 వెచ్చిస్తే మరో నాలుగు లడ్డూలు లభించేవి. ఇప్పుడు ఏకంగా దివ్యదర్శనాన్నే ఎత్తేశారు. సర్వదర్శనం, స్లాట్‌ దర్శనానికి వచ్చేవారికీ ఇదివరకు ఒక ఉచిత లడ్డూ, రూ.70కి మరో నాలుగు లడ్డూలు దొరికేవి. ఇప్పుడు ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇస్తున్నారు. బ్రేక్‌, సుపథం దర్శనాలకు వెళ్లినవారికి ఇది వరకు 2 లడ్డూలు ఇస్తే.. ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు.

ఆర్టీసీ ధరల వడ్డన సరేసరి

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ టికెట్‌ ఛార్జీలను మూడుసార్లు పెంచడం తిరుమల వెళ్లే భక్తులకు భారంగా మారింది. గుడివాడ నుంచి తిరుపతికి ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో 2019 నవంబరులో టికెట్‌ ధర రూ.620 ఉండేది. అది రూ.220 పెరిగి... ఇప్పుడు రూ.840 అయ్యింది. కాకినాడ నుంచి తిరుపతికి అప్పట్లో రూ.885 ఉన్న టికెట్‌ ధర ఇప్పుడు రూ.1,190కి చేరింది. వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో టికెట్‌ ధర రూ.75 ఉండేది. దాన్ని డీజిల్‌ సెస్‌ పేరుతో ఒకసారి రూ.85కి, ఆ తర్వాత మళ్లీ రూ.90కి పెంచారు. రెండు వైపుల టికెట్‌ ఒకేసారి తీసుకుంటే రూ.160కి ఇస్తున్నారు.


ఒక కుటుంబానికి కనీస ఖర్చు రూ.17వేల పైమాటే!

నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గుడివాడ నుంచి బస్సులో తిరుమల వెళ్లి, నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులు బసచేసి శ్రీవారిని దర్శించుకుని రావాలంటే కనీస వ్యయం రూ.17వేలవుతుంది. తిరుమలకు వెళ్లినవారు రెండు రోజులు ఉండాలనుకుంటే.. మొదట ఒకరోజుకు గది కేటాయించి తర్వాత మరో రోజుకు పొడిగిస్తారు. ఒకరోజు దాటాక ఒక గంట ఉన్నా, రెండు గంటలున్నా మొత్తం రోజుకు అద్దె కట్టాలి. ఇదివరకు నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులున్నా అద్దె రూ.300 అయ్యేది. పెంచిన ధరల ప్రకారం రూ.3,400 అవుతుంది.

* కొండపై ఉన్నప్పుడు తితిదే నిత్యాన్న దానంలో ఉచితంగా భోజనం చేస్తే... భోజనాల ఖర్చు తగ్గుతుంది. స్థానికంగా ఎక్కడికీ తిరగకపోతే ఆ ఖర్చూ తగ్గుతుంది.

* ఆ కుటుంబానికి గతానికీ ఇప్పటికీ అతిథి గృహం ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ప్రసాదం ధరలు పెరగడంవల్ల అదనంగా పడే భారం సుమారు రూ.5 వేలు.


నేడు భాజపా నిరసన

ఈనాడు, అమరావతి: తిరుమలలో గదుల అద్దెల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం భాజపా ఆందోళనలు చేయనుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు ధరలు తగ్గించాలని డిమాండు చేస్తూ వినతిపత్రాలు అందజేస్తారు. రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొంటారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని