ఎంటెక్‌ ప్రవేశాలు ఢమాల్‌

కృత్రిమ మేథ (ఏఐ)ను సృష్టించే వాళ్లుగా మారాలి. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారుకావడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో పని చేసే వయసుగలవారు 70 శాతం ఉన్నారు. నైపుణ్యం ఇవ్వలేకపోతే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం.

Published : 21 Aug 2023 05:13 IST

ఫీజుల చెల్లింపును నిలిపేసిన జగన్‌ సర్కారు
కోర్సుల్లో నాణ్యతలేమి మరో కారణం
ఈనాడు, అమరావతి

ఏఐ సృష్టించే వాళ్లుగా మారాలి

కృత్రిమ మేథ (ఏఐ)ను సృష్టించే వాళ్లుగా మారాలి. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారుకావడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో పని చేసే వయసుగలవారు 70 శాతం ఉన్నారు. నైపుణ్యం ఇవ్వలేకపోతే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం.

జులై 13న ఉపకులపతుల సమావేశంలో సీఎం జగన్‌

ఫీజుల చెల్లింపు నిలిపేస్తే ఎలా వస్తారు?

పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని నిలిపేస్తే ఏఐని సృష్టించే వాళ్లుగా విద్యార్థులు తయారవుతారా? మార్కెట్లోకి వస్తున్న ఎమర్జింగ్‌ కోర్సులపై ఉన్నత చదువుల్లేకుండానే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా తయారు కాగలుగుతారా? రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరే వారి సంఖ్య ఏటేటా దారుణంగా పడిపోతున్నా పట్టించుకోకుండా ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌, ఎంఐటీ, కేంబ్రిడ్జి బోధన పద్ధతులు అమలు చేస్తామంటే ఏం లాభం? ప్రైవేటులో ఎంటెక్‌లాంటి కోర్సులు చదవలేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవారు బీటెక్‌తోనే ఆపేస్తున్న వైనం సీఎం జగన్‌కు తెలుసా?

రాష్ట్రంలో ఎంటెక్‌ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ప్రవేశ పరీక్ష రాసేందుకు సైతం వారు ఆసక్తి చూపించడం లేదు. కారణం.. ఆ కోర్సుల్లో నాణ్యతలేమి, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని జగన్‌ సర్కారు నిలిపేయడమే. ఎంటెక్‌పై ఆసక్తి ఉన్నవారు ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు, ఐఐటీ, నిట్‌, ట్రిపుల్‌ ఐటీలాంటి విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఆ కోర్సులో చేరేవారికంటే విదేశాల్లో ఎంఎస్‌ చేసేందుకు వెళ్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరికొందరు బీటెక్‌ తరువాత ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఎంటెక్‌ చేసేవారు తగ్గిపోతుండడంతో బీటెక్‌ కోర్సులకు అధ్యాపకుల కొరత ఏర్పడుతోంది. చాలా ప్రైవేటు కళాశాలలు పాఠాలు చెప్పించేందుకు ఇబ్బందులు పడుతున్నాయి.

ఆర్థిక భారం భరించలేక

ఎంటెక్‌లో ఎమర్జింగ్‌ కోర్సులు ప్రైవేటు కళాశాలల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో చేరితే ప్రభుత్వం ఫీజులు ఇవ్వటం లేదు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే పీజీ కోర్సులకు బోధనా రుసుముల చెల్లింపును నిలిపేసింది. పేదలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మంచి ప్రైవేటు కళాశాలల్లో చదవాలంటే ఖర్చు సొంతంగానే భరించాల్సిన పరిస్థితి. సాధారణంగా ఉపాధి అవకాశాలున్న కోర్సులవైపే విద్యార్థులు మొగ్గు చూపుతారు తప్ప.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఫీజు రీయంబర్స్‌మెంటు వస్తుందని వాటిల్లో చేరరు కదా? అందుకే ఆర్థిక భారం భరించలేనివారు ఎంటెక్‌కు వెళ్లలేకపోతున్నారు.

  • ప్రైవేటు విద్యాసంస్థలకు 2019-20 వరకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 450 కోట్లు ఇవ్వాలని నాలుగేళ్లుగా యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇటీవల వారిపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం 75 శాతమే చెల్లిస్తామని మెలికపెట్టి, అంగీకరించాలని ఆదేశించింది. వచ్చిందే చాలనుకుని యాజమాన్యాలు అంగీకార పత్రాలను సమర్పించాయి. ఇప్పటికి మూడునెలలు గడిచినా బకాయిలివ్వలేదు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు చాలా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. కొంతమంది ఆ డబ్బు చెల్లించి ధ్రువపత్రాలు తీసుకోగా. మరికొంతమంది వదిలేశారు.

విదేశాలకే ప్రాధాన్యం..

స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, కోర్సుల్లో నాణ్యత లోపించడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తర్వాత ఎంటెక్‌లో చేరేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆసక్తి ఉన్నవారేమో విదేశాల్లోని విద్యాలయాలు, జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. విదేశాల్లో ఎంఎస్‌కు వెళ్తున్న విద్యార్థులు ఏటా 25 వేల వరకు ఉంటే.. రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరుతున్న వారు ఈ నాలుగేళ్లలో సరాసరిన 8 వేలలోపే ఉన్నారు. అమెరికాకు వెళ్లే వారే 15 వేలకుపైగా ఉంటారని అంచనా. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లే వారు మరో 10 వేల వరకు ఉంటారు.

అధ్యాపకుల కొరత..

ఎంటెక్‌ చేసే వారు తగ్గిపోవడంతో ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్సు, ఇతర ఎమర్జింగ్‌ కోర్సుల బోధనకు అధ్యాపకుల కొరత ఏర్పడింది. పీజీ చేసినా అదనంగా జీతాలొచ్చే పరిస్థితి లేదు. చాలామంది బీటెక్‌తోనే ఆగిపోతున్నారు. మరోపక్క ఇంజినీరింగ్‌ కళాశాలలకు ప్రభుత్వం నిర్ణయిస్తున్న బోధన రుసుములు చాలా తక్కువగా ఉండడంతో ఎక్కువ జీతాలిచ్చి, అధ్యాపకులను పెట్టుకునేందుకు యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. కళాశాలల నిర్వహణ కష్టమై అధ్యాపకులకు సరైన జీతాలివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఎంటెక్‌ చేసి, అధ్యాపక వృత్తిలోకి వచ్చేందుకు యువత ఆసక్తి చూపడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని