Viveka murder case: వివేకా హత్య కేసులో కొత్త మలుపు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు.
సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్పై పులివెందులలో కేసు నమోదు
ఈనాడు, కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో (Viveka murder case) కొత్త మలుపు చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదుచేశారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని.. ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్ను కలిసి వినతిపత్రం అందచేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.