కోడ్‌ కూసేలోపు.. రూ.7వేల కోట్ల రుణం!

రుణాల కోసం ఏ అవకాశాన్నీ జగన్‌ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతున్నా, ఈ లోపే రూ.7వేల కోట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది.

Updated : 14 Mar 2024 06:01 IST

ప్రభుత్వానికి దస్త్రం పంపిన ఏపీఎండీసీ
నేడో, రేపో ఆన్‌లైన్‌లో మంత్రివర్గ ఆమోదం
బాండ్ల రూపంలో తీసుకునే రుణమంతా ప్రభుత్వానికే

ఈనాడు, అమరావతి: రుణాల కోసం ఏ అవకాశాన్నీ జగన్‌ ప్రభుత్వం వదలట్లేదు. వీలైనంత తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతున్నా, ఈ లోపే రూ.7వేల కోట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో పడింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రైవేటుబాండ్ల రూపంలో రూ.7వేల కోట్ల రుణం సమకూర్చుకునేందుకు శరవేగంగా దస్త్రాన్ని కదిపింది. ఆఘమేఘాలపై మంత్రివర్గ ఆమోదం తీసుకునేందుకు సిద్ధమైంది. ఏపీఎండీసీ చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు బాండ్ల ద్వారా రుణం తీసుకోనున్నారు. అదీ ఆ సంస్థ అవసరాల కోసం కాకుండా, ప్రభుత్వానికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ దస్త్రాన్ని రూపొందించారు. దీన్ని రెండురోజుల క్రితం ప్రభుత్వానికి పంపారు.

ఆన్‌లైన్‌లో మంత్రివర్గ ఆమోదం కోసం..

ఈ దస్త్రానికి మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి అని తెలిసింది. దీంతో ఆన్‌లైన్‌లోనే మంత్రుల నుంచి ఆమోదం తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఈ తంతు పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వెంటనే నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌)లో లిస్టింగ్‌ చేసి బాండ్ల ద్వారా ఏపీఎండీసీ రుణం తీసుకోనుంది. ప్రస్తుతానికి 8.7% వడ్డీరేటుతో రుణానికి ప్రతిపాదించారు. ఈ రేటుకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే.. దాన్ని మరింత పెంచే వీలుందని తెలిసింది.

ఏపీఎండీసీకి వడ్డీ భారం

బాండ్ల ద్వారా రూ.7వేల కోట్ల రుణం తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న ఏపీఎండీసీకి.. వడ్డీ మాత్రం భారం కానుంది. పదేళ్లపాటు ఏటా రూ.610 కోట్ల మేర వడ్డీ చెల్లించాలి. రుణం వాడుకోకుండా వడ్డీ మాత్రం కట్టడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏపీఎండీసీ అవసరాల కోసం కనీసం రూ.2వేల కోట్లు అయినా ఉంచుకునేలా చూడాలని కొందరు అధికారులు.. ఎండీ వెంకటరెడ్డికి సూచించినట్లు సమాచారం. అయినా మొత్తం రుణాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకే ఎండీ నిర్ణయించారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని