దేవుడా.. నువ్వే దిక్కు!

వైకాపా నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.

Updated : 27 Mar 2024 10:05 IST

ఆలయంలోనే దుర్భాషల దండకం
జగన్‌ ప్రభుత్వంలో అయిదేళ్లుగా ఇదే తంతు
కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు
కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశమైన వైకాపా నేతల తీరు
ఈనాడు - అమరావతి

వైకాపా నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటివారిపై అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, దాడులు చేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో ఎక్కడోచోట ఇలాంటి దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా, అధికారపార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇలాంటివారిపై ఒక్కసారైనా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటే, మరోసారి జరిగేవి కావు. కానీ వైకాపా ప్రభుత్వం తమ నేతలను కాపాడే ప్రయత్నాలే చేస్తోంది. దీంతో వీరు మరింత రెచ్చిపోయి అర్చకులపై దాడులు కొనసాగిస్తున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నేత, మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావు ఇద్దరు అర్చకులపై దాడిచేయడంతో.. మరోసారి వైకాపా నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

చర్నాకోలాతో వాతలు పడేలా దాడి..

ఉమ్మడి కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబరులో పూజారులపై ఆలయ ఛైర్మన్‌ తదితరులు చర్నాకోలాతో దాడిచేసి, వాతలు పడేలా కొట్టారు.

కార్తికపౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా, భక్తులకు ఉచిత దర్శనాలకూ అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణిశర్మ, సుధాకర్‌శర్మ, మురుగు ఫణిశర్మ సూచించారు. దీంతో ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులైన అక్కడి అటెండర్లు కలిసి.. పూజారులపై దాడిచేశారు. ఉత్సవాల్లో వినియోగించే చర్నాకోలా తీసుకొని పూజారులను ఇష్టానుసారం కొట్టారు. ఈ ఘటనలో మురుగు ఫణిశర్మకు వాతలు పడ్డాయి. దీంతో అప్పట్లో ఆలయ ఛైర్మన్‌తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్‌ చేసినా, మళ్లీ కొంత కాలానికే నాగరాజుకు వేరొక ఆలయంలో పోస్టింగ్‌ ఇచ్చారు.

జంధ్యాన్ని తెంచేసి..

పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్రపవన్‌పై ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ భర్త యుగంధర్‌ గతేడాది ఆగస్టులో దాడిచేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్‌ను పక్కకు జరగాలని చెప్పినందుకు.. నాగేంద్రపవన్‌పై దురుసుగా వ్యవహరించి, దాడిచేసి, మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. దీంతో ఆలయ ఛైర్మన్‌తో ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు.

దాడిచేసినా కేసు నమోదు చేయకుండా..

గుంటూరు నగరంలోని గోరంట్లలో పద్మావతీ ఆండాళ్‌ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు సాయిచరణ్‌పై గతేడాది సెప్టెంబరులో అధికారపార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్‌ లక్ష్మీనారాయణ దాడిచేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి, కర్రతో దాడిచేయడంపై అర్చకుడు సాయిచరణ్‌ సెప్టెంబరు 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైకాపా నేతలను అరెస్టు చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదుచేసి, ఇద్దరినీ అరెస్టు చేశారు.

అధికారులదీ చులకన భావనే..

అర్చకుల విషయంలో దేవాదాయశాఖ అధికారులు కూడాచులకనగా వ్యవహరిస్తున్నారు. వారిని వేధించే ఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

  • సత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశానికి ముఖ్య అర్చకుడు అంజన్‌కుమార్‌ హాజరుకాగా, ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని ఈవో శ్రీనివాసరెడ్డి రుసరుసలాడారు. ఈవో తీరును నిరసిస్తూ అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు దేవాదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ అక్కడికి వెళ్లి రాజీ చేశారు.
  • పల్నాడు జిల్లా కోటప్పకొండలో గతేడాది అక్కడ పనిచేసిన ఈవో గోపి.. కొత్తగా వివిధ పూజలను ఆరంభించారు. అర్చనలు, పూజలను తాను చెప్పినప్పుడే చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు. ఇవి సాంప్రదాయానికి విరుద్ధమని అర్చకులు అభ్యంతరం చెప్పారు. దీంతోఇరువురిమధ్య వివాదం ఏర్పడింది. చివరకు ఈవోని అక్కడి నుంచి బదిలీచేశారు.

పురోహితుల కోసం వేలం..

అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో గతేడాది ఇన్‌ఛార్జ్‌ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ పురోహితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారాయి. ఆలయ సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునేవారికి సింగిల్‌విండో విధానంలో దేవస్థానం తరఫునే అన్నీ సరఫరా చేస్తామని ఈవో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన పురోహితుల సరఫరా కోసం గుత్తేదారు ఎంపికకు గత ఏడాది జులైలో టెండర్లు ఆహ్వానించడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. పురోహితుల కోసం వేలం నిర్వహిస్తారా? అంటూ అర్చకులు, పురోహితులు మండిపడ్డారు. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

 అన్నవరం కొండపై ఉండే పురోహితులు కాకుండా, బయటినుంచి పురోహితులను తీసుకొస్తే.. వివాహానికి రూ.5వేలు, ఉపనయనానికి రూ.2వేలు చెల్లించాలనే నిబంధనతీసుకొచ్చారు. దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తంచేసి, ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్నీ ఉపసంహరించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని