అది ‘వినయ’ విధేయ రౌడీరాజ్యం!

దోచుకోవడం.. దాచుకోవడంలో వైకాపా నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌!కొంతమంది స్వయంగా రంగంలోకి దిగితే.. మరికొందరు కుటుంబ సభ్యులను దించుతారు. 

Updated : 27 Mar 2024 04:41 IST

అధికారం తండ్రిది.. పెత్తనం మాత్రం తనయుడిది.. 
రౌడీగ్యాంగ్‌తో చేయని అరాచకం లేదు
కొల్లేరును చెరబడుతూ.. మట్టిలోనూ కాసులవేట
రైతుల చేపల చెరువులనూ లాగేసుకుంటున్న వైనం
ఈనాడు, అమరావతి

దోచుకోవడం.. దాచుకోవడంలో వైకాపా నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌!కొంతమంది స్వయంగా రంగంలోకి దిగితే.. మరికొందరు కుటుంబ సభ్యులను దించుతారు.  కొల్లేరు అనగానే గుర్తొచ్చే నియోజకవర్గంలోని వ్యవహరం అలాంటిదే! తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని.. కుమారుడు కథ నడిపిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల దగ్గర్నుంచి.. కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలు.. మట్టి విక్రయాలు.. అల్లరి మూకలతో దందా వరకూ.. అతని కనుసన్నల్లోనే సాగుతోంది. చివరకు ఠాణాలో కేసు నమోదు చేయాలన్నా.. సర్కారు కార్యాలయాల్లో ఫైల్‌ కదలాలన్నా.. ఈ తండ్రీకొడుకులు కనుసైగ చేయాల్సిందే!

సియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఆ సరస్సు ఇప్పుడెంత కాలుష్య కాసారమైందో.. అక్కడున్న ఒక ప్రజాప్రతినిధి వల్ల అంతా కకావికలమైంది. అధికారం అండతో, యంత్రాంగం సహకారంతో ఆయన మాత్రం కొల్లేరు పరిధిలో ఇష్టానుసారం తవ్వేస్తూ.. మట్టిని తరలిస్తూ.. చేపల చెరువుల అద్దెల రూపంలో ఏటా కోట్లు వెనకేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో పెత్తనమంతా ఈ ప్రజాప్రతినిధి కొడుకుదే. అతను ఆడింది ఆట.. పాడింది పాట. చీమ చిటుక్కుమనాలన్నా అతడి అనుమతి ఉండాల్సిందే. జగనన్న కాలనీ స్థలాల్లో అవకతవకలు మొదలు, పోలీస్‌ స్టేషన్లో పంచాయతీల వరకు ప్రతి విషయాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవటంలో ఈ కుటుంబం దిట్ట. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలూ కొందరు వీరి వేధింపులకు బలి కావడం గమనార్హం.


ఒకే అంశం.. మూడు విధాలుగా అక్రమం 

పేదల ఇళ్ల పట్టాల వ్యవహారంలోనూ ఈ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. జగనన్న కాలనీల కోసం స్థల సేకరణ ఎక్కడ చేయనున్నారో ముందే తెలుసుకున్నారు. ఇంకేముంది.. బినామీలతో ఆ ప్రాంతంలో తక్కువ ధరకు భూములు కొనిపించారు. ఒక మండల కేంద్రంలో దాదాపు 100 ఎకరాల లేఅవుట్‌ వేశారు. ఆ తర్వాత పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించారు. ఇలా ఆ ప్రజాప్రతినిధి వెనకుండి నడిపించిన ఈ తతంగంలో భారీగా లాభపడ్డారు. ఆ ఇళ్ల స్థలాలను చదును చేయించడంలోనూ బాగానే వెనకేసుకున్నారు. అంతా అయ్యాక.. ఇళ్ల స్థలాలను పంచే క్రమంలోనూ అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే.. ఒక్క జగనన్న కాలనీల అంశంలోనే ఈ తండ్రీకుమారులు మూడు విధాలుగా లబ్ధి పొందారన్నమాట.   


రైతుల కడుపుకొట్టి.. 

తంలో నియోజకవర్గానికి చెందిన 62 మంది రైతులు తమకున్న కొంత కొంత భూమి కలిపి మొత్తంగా 100 ఎకరాల్లో చెరువుగా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని చేపల సాగుకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ప్రజాప్రతినిధి పుత్రరత్నం కళ్లు ఈ చేపల చెరువుపై పడ్డాయి. బెదిరింపులతో అద్దెదారుడి నుంచి తమ చేతిలోకి తీసుకున్నారు. ‘ఈ చెరువును ఇక మేమే సాగు చేస్తాం. ఇచ్చినంత తీసుకోండి’ అంటూ రైతులకు హుకుం జారీ చేశారు. చేపల చెరువును తామే స్వచ్ఛందంగా కౌలుకు ఇస్తున్నామని పత్రాలు రాయించి సంతకాలూ తీసుకున్నారు.


చెరువుల పేరిట వసూళ్లు 

ప్రజాప్రతినిధికి కొల్లేరు ఒక ప్రధాన ఆదాయ వనరు. తన కనుసన్నల్లోనే సరస్సును ఆనుకొని వందల ఎకరాల చెరువులు తవ్వించారు. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఏటా వసూలు చేస్తున్నారు. అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులు అటవైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటారు. ఈ ప్రజాప్రతినిధి ఏ కార్యక్రమం నిర్వహించినా, కొల్లేరు ప్రాంత ప్రజలంతా సొంత ఖర్చులతో హాజరుకావాల్సిందే. కొల్లేరు పరిధిలో తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ఓ అటవీశాఖ అధికారిని బదిలీ చేయించారు. కొల్లేరులో తవ్వకాలకు అవకాశం కల్పిస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు తెగబడ్డారీ తండ్రీకుమారులు. ఆ తవ్విన మట్టినంతా ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమ స్థలానికి అడ్డుగా ఉన్నాయని.. నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో 50 గృహాలు, దుకాణాలను ఆక్రమణల పేరుతో తొలగించేలా చేశారు.


రౌడీగ్యాంగ్‌తో అరాచకాలు

ప్రజాప్రతినిధి కుమారుడు చూసేందుకు వినయ విధేయతతో కనిపించినా.. కొంతమంది యువకులతో ఏకంగా ఒక రౌడీగ్యాంగ్‌నే నడిపిస్తున్నారు. మాట వినకపోయినా, ఎదురుచెప్పినా.. ఆ రౌడీ మూక రంగంలోకి దిగుతుంది. ఏకంగా పోలీసు స్టేషన్‌లోనే సొంత పార్టీ నాయకుడిపైనే ఈ రౌడీగ్యాంగ్‌ దాడి చేసి కొట్టిందంటే.. ఈ అయిదేళ్లలో వారి అరాచకాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు చేయాలన్నా, ప్రభుత్వ కార్యాలయంలో పని కావాలన్నా ఈ పుత్రరత్నం అనుమతి తప్పనిసరి. ఈ రౌడీగ్యాంగ్‌ అరాచకాలు శ్రుతి మించడం పట్ల అధికార పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వారిపైనా కక్షగట్టి మరీ కేసులు పెట్టించారు. స్థానికంగా వీళ్లకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఓ మహిళా నాయకురాలు.. విజయవాడకు వెళ్లి మరీ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

  • ఈ నియోజకవర్గంలోని ఒక పంచాయతీ వార్డు సభ్యుడు సామాజిక అంశాల్లో కీలకంగా ఉంటారు. తెదేపా సానుభూతిపరుడు కూడా. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తూ వివరాలు సేకరిస్తుంటారు. ఈ ప్రజాప్రతినిధిపైనా ఇలా స.హ.చట్టం కింద దరఖాస్తులు చేసి సమాచారం రాబట్టడం వారికి నచ్చలేదు. దాంతో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయించారు. ఒకరోజు పంచాయతీ గ్రామసభ జరుగుతుండగా, రౌడీగ్యాంగ్‌ వచ్చి.. యువతితో అసభ్యంగా ప్రవర్తించావంటూ.. అతడిపై దాడి చేశారు.
  •  స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాకు చెందిన ఒక నాయకుడు తన భార్యతో నామినేషన్‌ వేయించడానికి ప్రయత్నించగా.. కేసులు పెడతామని బెదిరించి వెనక్కి తగ్గేలా చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని