దురుద్దేశంతో కేసు నమోదు

పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 08 May 2024 06:33 IST

హైకోర్టులో సునీత తరఫు న్యాయవాది వాదన
తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి 

ఈనాడు, అమరావతి: పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా(రిజర్వు) వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వివేకా హత్యకేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో ఆయన పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఒత్తిడి చేస్తున్నారని, సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు.

కారణాలను పేర్కొనలేదు..

పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖరరెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిగింది. సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్‌ ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్‌.. యాంత్రిక ధోరణిలో పోలీసులకు పంపారన్నారు. ఎలాంటి కారణాలనూ పేర్కొనలేదన్నారు. దురుద్దేశంతో పిటిషనర్లపై ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారన్నారు. కేసును కొట్టేయాలని కోరారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి, ఫిర్యాదుదారుడు కృష్ణారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు