PAN Aadhaar Link: పాన్‌, ఆధార్‌ అనుసంధానం.. ట్యాక్స్‌పేయర్లకు మే 31 లాస్ట్‌డేట్‌

PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్‌-ఆధార్‌ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.

Updated : 28 May 2024 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Link) చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. చేయనివారి పాన్‌ ఇప్పటికే  నిరుపయోగంగా మారి ఉంటుంది. అలాంటి వారు రూ.1,000 అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. దీన్ని 2024 మే 31లోపు పూర్తి చేయాలని తాజాగా ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.

లేనిపక్షంలో 2024 మార్చి 31కి ముందు చేసిన లావాదేవీలపై అధిక రేటు వద్ద పన్ను కోత/పన్ను చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. టీడీఎస్‌/టీసీఎస్‌ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత/చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని స్పష్టం చేసింది. అలాంటి వారందరికీ మే 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆలోపు పాన్‌ యాక్టివేట్‌ అయినవారిపై ఎలాంటి అదనపు భారం ఉండదని వెల్లడించింది.

అనుసంధానం అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ ఎప్పటి నుంచో చెబుతోంది. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరికి తాము అనుసంధానం చేసిందీ లేనిదీ గుర్తు లేదు. ఒకవేళ ఆ సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో ‘లింక్‌ ఆధార్‌ స్టేటస్‌’పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్‌ అయినట్లు సందేశం కనిపిస్తుంది. లేకుంటే ఫైన్‌ చెల్లించి ఆధార్‌-పాన్‌ అనుసంధానం పూర్తి చేయాలి.

ఫైన్‌ చెల్లించి అనుసంధానం ఇలా..

  • ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి ఎంటర్‌ కావాలి. అందులో ‘ఈ-పే ట్యాక్స్‌’పై క్లిక్‌ చేయాలి.
  • అక్కడ పాన్‌ నంబర్‌ను రెండుసార్లు ధ్రువీకరించుకోవాలి. దిగువన ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.
  • తర్వాతి పేజీలో మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి.
  • వెరిఫికేషన్‌ పూర్తయ్యాక మీకు వేర్వేరు పేమెంట్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాలి.
  • తర్వాతి ప్రక్రియలో అసెస్‌మెంట్‌ ఇయర్‌ (Ay 2023-24)ను ఎంచుకోవాలి. తర్వాత అదర్‌ రిసిప్ట్స్‌ (Other receipts (500) ఎంచుకోవాలి.
  • ఈ ప్రక్రియ పూర్తయ్యాక పేమెంట్‌ గేట్‌వేకు వెళుతుంది. అక్కడ చెల్లింపు పూర్తి చేయాలి.
  • పేమెంట్‌ పూర్తయ్యాక సంబంధిత వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోని లింక్‌ ఆధార్‌ను క్లిక్‌ చేసి పాన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని