IRCTC tour package: వేసవి సెలవుల్లో కేరళ అందాలు.. IRCTC ప్యాకేజీ వివరాలివే..

IRCTC kerala package: ఈ వేసవి సెలవుల్లో కేరళ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? మీ కోసమే ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇవీ..

Published : 02 May 2023 11:13 IST
IRCTC kerala package: కేరళ అనగానే వెంటనే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. తేయాకు తోటలే గుర్తొస్తాయి. అలాంటి ప్రకృతి సోయగాలకు నెలవైన కేరళను చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే, కేరళలోని వివిధ ప్రాంతాలను చుట్టి రావడానికి ప్రయాణాన్ని ప్లాన్‌ చేయలేక కొందరు.. టికెట్‌ గురించి ఆలోచించి మరికొందరు వెనకడుగు వేస్తుంటారు. అయితే, తక్కువ ఖర్చుతో కేరళ టూర్‌ (Kerala tour)  వెళ్దామనుకునే వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కేరళ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది.

కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌...

KERALA HILLS & WATERS పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. మే 9 నుంచి జూన్‌ 27 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో టూరిస్టులు ఈ రైలు ఎక్కొచ్చు. కేరళ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. మే9 నుంచి వారానికోసారి సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. మీకు అనువైన సమయం, టికెట్లు అందుబాటును బట్టి మీకు నచ్చిన తేదీని ఎంచుకోవచ్చు. మే 9, 16, 23, 30... ఇలా జూన్‌ 27 వరకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి మంగళవారం ప్రయాణం ఉంటుంది.  త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి రెగ్యులర్‌ నడిచే ట్రైనే అయినప్పటికీ.. మంగళవారం రోజు పర్యాటకులకు కేటాయించారు.

కేరళ ప్రయాణం ఇలా..

  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నిర్దేశిత తేదీల్లో ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం.17230)లో  ప్రయాణించాల్సి ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకుంటుంది. అక్కడ ఐఆర్‌సీటీసీ సిబ్బంది మున్నార్‌కు చేరుస్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ రోజు రాత్రి మున్నార్‌ హోటల్‌లో సేద తీరాలి.
  • మూడో రోజు ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక ఎరవికులం నేషనల్‌ పార్క్‌, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్‌ వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో బస చేయాలి. 
  • నాలుగో రోజు ఉదయం అలెప్పీ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకున్నాక అలెప్పీ అందాలను వీక్షించటానికి వెళ్తారు. దాంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 11:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. 
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  • సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.32,230
  • ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.18,740
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.15,130
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి బెడ్‌తో అయితే రూ.8,730, బెడ్‌ లేకుండా అయితే రూ.6,530 చెల్లించాలి.

భోజనం టూరిస్టులదే..

🚆 ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 3 ఏసీ, స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం ఉంటుంది.

🚆 ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.

🚆 కేరళలో మూడు రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.

🚆 ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

🚆 టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగానే ఉంటాయి.

🚆 మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.

🚆 పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.

🚆 బోటింగ్‌, హార్స్‌ రైడింగ్‌ వంటివి ప్యాకేజీలో ఉండవు.

🚆 గైడ్‌ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.

  • ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. యాత్రకు 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్‌ మొత్తం ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని