విశాఖ కేజీహెచ్‌లో వైద్యమందక.. ఆగిన చిన్నారి ఊపిరి

సకాలంలో వైద్యమందక విశాఖ కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో ఓ చిన్నారి కన్నుమూసింది. మరో సంఘటనలో ఇక్కడే కొవిడ్‌ బాధితుడు ఒకరు భవనంపై నుంచి పడి చనిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం

Updated : 28 Apr 2021 10:11 IST

కొవిడ్‌ వార్డు నుంచి పడి బాధితుడి మృతి

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: సకాలంలో వైద్యమందక విశాఖ కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో ఓ చిన్నారి కన్నుమూసింది. మరో సంఘటనలో ఇక్కడే కొవిడ్‌ బాధితుడు ఒకరు భవనంపై నుంచి పడి చనిపోయారు. ఈ హృదయ విదారక దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగి వీరబాబు కుమార్తె చార్విత (15నెలలు) కొవిడ్‌తో అస్వస్థతకు గురైంది. తొలుత అచ్యుతాపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. అయినా ఆరోగ్యం మెరుగుపడనందున మంగళవారం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీస్కాన్‌లో లక్షణాలు కన్పించాయి. తదుపరి చికిత్స కోసం సాయంత్రం కేజీహెచ్‌కు రాగా గంటన్నర నిరీక్షణ అనంతరం చేర్చుకున్నారని తండ్రి వీరబాబు వివరించారు. పరిస్థితి విషమించి పసిపాప చనిపోయింది. అంబులెన్సులో ఆక్సిజన్‌పై ఉంచిన చిన్నారిని కొవిడ్‌ ఆసుపత్రి వైద్యులు వెంటనే చేర్చుకోలేదని తండ్రి రోదించారు. వచ్చిన వెంటనే చేర్చుకొని వైద్యం ప్రారంభించామని, అప్పటికే పాప పరిస్థితి విషమించిందని కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారిణి పి.మైథిలి తెలిపారు.
* కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న అమ్మలకంటి వెంకటరావు(41) వార్డు నాలుగో అంతస్తు నుంచి కాలుజారి కిందపడి చనిపోయారు. 13రోజుల క్రితం ఇదే వార్డులో ఓ బాధితురాలు దూకి ఆత్మహత్య చేసుకుంది.


నిండు గర్భిణి మృత్యువాత

గాజువాక, న్యూస్‌టుడే: మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన గర్భిణి మృత్యుఒడికి చేరుకున్నారు. విజయనగరానికి చెందిన తారకేశ్వరరావు, పార్వతి(33)లు గాజువాకలో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పార్వతి ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కరోనా లక్షణాలతో బాధపడుతూ ఇంట్లోనే మందులు వాడుతున్నారు. ఈ నెల 23న గొంతులో మంట, శ్వాస సంబంధ సమస్యలు రావడంతో అగనంపూడిలోని సీహెచ్‌సీలో చేర్పించారు. పాజిటివ్‌గా తేలడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని