Bengaluru: పాపం పసివాడు.. అమ్మ శాశ్వత నిద్రలో ఉందని తెలియక..

తల్లి చనిపోయిందని తెలియని ఆ బాలుడు ఆమె మృతదేహం పక్కనే రెండు రోజులు గడిపిన హృదయ విదారక ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

Published : 03 Mar 2023 00:41 IST

బెంగళూరు: తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియక ఓ పసివాడు ఇంట్లో ఆమె మృతదేహం పక్కనే రెండు రోజులు గడిపాడు. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరు(Bengaluru)లో వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి నిద్ర పోతోందని భావించిన ఆ 11ఏళ్ల బాలుడు ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిందని, ఇక తిరిగిరాదన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌లో నివాసం ఉంటున్న అన్నమ్మ (44) అనే మహిళ కొంతకాలంగా హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌తో బాధపడుతూ ఇంట్లో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆ బాలుడు మాత్రం రోజూ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆడుకుంటూ, వారితోపాటే భోజనం చేసి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో తన తల్లి మాట్లాడటంలేదని.. రెండు రోజులుగా నిద్రలోనే ఉందని తోటి స్నేహితులతో చెప్పాడు. దీంతో వారు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. వారు బాలుడి ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించడంతో చట్టపరమైన లాంఛనాలు పూర్తిచేసి అంత్యక్రియలు నిర్వహించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని