Telangana news: సోదరుడి హత్య కేసులో ఎర్రశేఖర్‌ను నిర్దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషిగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టేసింది.

Published : 13 May 2022 16:09 IST

హైదరాబాద్: జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. సోదరుడి హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఎర్ర శేఖర్‌ను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎర్ర శేఖర్ భార్య భవానీ, మరో ఏడుగురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

2013 జూలై 17న ఎర్రశేఖర్‌ సోదరుడు ఎర్ర జగన్‌మోహన్‌ హత్యకు గురయ్యాడు. దేవరకద్ర బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో జగన్‌మోహన్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన దేవరకద్ర పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ఆయన భార్య భవానీతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. దేవరకద్ర మండలం పెద్దచింతకుంట గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎర్ర శేఖర్, ఆయన సోదరుడు ఎర్ర జగన్‌మోహన్‌ మధ్య గొడవ తలెత్తినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎర్ర శేఖర్ భార్య భవానీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఎర్ర జగన్‌మోహన్‌ భార్య అశ్విత సైతం నామినేషన్ దాఖలు చేయడం విబేధాలకు కారణమైంది. జగన్‌మోహన్‌ హత్య కేసులో దేవరకద్ర పోలీసులు ఎర్రశేఖర్, భవానీతో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు. కేసును విచారించిన ప్రజా ప్రతినిధుల కోర్టు... సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని