పోలీస్‌ దెబ్బలకే కన్నుమూశాడు!

దొంగ అనే అనుమానంతో మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తిపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నాలుగు రోజులు విపరీతంగా కొట్టాక.. నిందితుడు అతడు కాదని తెలిసి వదిలేశారు.

Updated : 18 Feb 2023 06:32 IST

దొంగ అనే అనుమానంతో నా భర్తను తీసుకెళ్లి కొట్టారు
మెదక్‌ పట్టణానికి చెందిన సిద్ధేశ్వరి ఆవేదన
కొట్టలేదు.. ఆరోపణలపై విచారణ చేస్తున్నాం: డీఎస్పీ

ఈనాడు, సంగారెడ్డి: దొంగ అనే అనుమానంతో మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్‌ అనే వ్యక్తిపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నాలుగు రోజులు విపరీతంగా కొట్టాక.. నిందితుడు అతడు కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలపాలైన భర్తను ఆసుపత్రికి తీసుకెళదామని భార్య ప్రయత్నించగా.. తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉంచాలని పోలీసులు బెదిరించారు. బలం గోలీలు తెచ్చిస్తాం.. వేసుకొంటే సర్దుకుంటుందని చెప్పారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా.. గాంధీలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో ఖదీర్‌ఖాన్‌ మృతి చెందారు. తమకు న్యాయం చేయాలని ఈనెల 6వ తేదీన కుటుంబం సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వేడుకున్నారు. ఖదీర్‌ఖాన్‌ భార్య సిద్ధేశ్వరి తెలిపిన వివరాలివీ..

మెదక్‌ పట్టణానికి చెందిన మహ్మద్‌ ఖదీర్‌ఖాన్‌(37) చిరు వ్యాపారి. భార్య సిద్ధేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు. గతనెల 12న హైదరాబాద్‌లోని చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. అదే నెల 27న పట్టణంలోని అరబ్‌గల్లీలో నడుచుకుంటూ వెళుతుండగా పుస్తెలతాడు కొట్టేశారంటూ ఒక మహిళ మెదక్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడి పోలికలు ఉండడంతో ఖదీర్‌ఖాన్‌ను హైదరాబాద్‌లో జనవరి 29న అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2 వరకు మెదక్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. అదే రోజు భార్యకు విషయం చెప్పిన పోలీసులు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లాలన్నారు. ఠాణాకు వెళ్లి చూస్తే.. భర్త నడవలేని స్థితిలో ఉన్నారు.  అతి కష్టంమీద ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తామే కొన్ని మందులు తెచ్చిస్తామని ఆయన్ను బయటకు తీసుకురావొద్దని హుకుం జారీ చేశారు. ఈనెల 8న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తొలుత మెదక్‌లోని ప్రభుత్వాసుపత్రికి, అట్నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. ఈనెల 12న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో మరణించారు.  


మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి కుటుంబసభ్యులకు అప్పగించాం: డీఎస్పీ

ఈ విషయమై మెదక్‌ డీఎస్పీ సైదులును వివరణ కోరగా.. ‘‘దొంగతనం చేశాడనే అనుమానంతో ఖదీర్‌ఖాన్‌ను మెదక్‌ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతికపరమైన విచారణ చేశారు. కొట్టలేదు. దొంగతనం చేయలేదని తేలడంతో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చి కుటుంబసభ్యులకు అప్పగించాం. ఆ తర్వాత కొద్దిరోజులకు అతను అస్వస్థతకు గురయ్యాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. పోలీసులు కొట్టారని ఆరోపణలు రావడంతో స్థానిక ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుళ్లు ఆర్‌.పవన్‌కుమార్‌, బురుకాల ప్రశాంత్‌లను ఈనెల 14న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బదిలీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని తెలిపారు.


తలకిందులుగా వేలాడదీశారు....

సుపత్రిలో ఉన్న ఖదీర్‌ఖాన్‌ను పరామర్శించేందుకు ఈనెల 9న పలువురు నేతలు, స్థానికులు ఆయన వద్దకు వెళ్లారు. తనను పోలీసులు ఎలా కొట్టారో వారికి ఆయన వివరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ‘పోలీసులు.. మెదక్‌ ఠాణాలో వస్త్రాలు విప్పి 2 గంటల పాటు తలకిందులుగా వేలాడదీశారు. బెల్టు, కర్రలతో విపరీతంగా కొట్టారు. భరించలేకపోయా. దొంగతనం చేయలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు’ అని చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని