HYD News: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు?

మాదాపూర్‌లో జరిగిన ప్రేమికుల ఆత్మహత్య కేసులో ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులొస్తే ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు.

Updated : 31 Jul 2021 07:09 IST

సవాలుగా మారిన ప్రేమికుల ఆత్మహత్య కేసు

ఈనాడు, హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: మాదాపూర్‌లో జరిగిన ప్రేమికుల ఆత్మహత్య కేసులో ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులొస్తే ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు. వాళ్ల వద్ద పూర్తి సమాచారం లేకపోవడంతో దర్యాప్తు సైబరాబాద్‌ పోలీసులకు సవాలుగా మారింది.

ఒత్తిడి తెచ్చినందుకేనా..?

నెల రోజుల కిందట సంతోషి తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా తమకెలాంటి అభ్యంతరం లేదని ఆమె సోదరుడు రాఘవేందర్‌ చెప్పాడు. రాములు కుటుంబ పెద్దలు కులాంతర వివాహానికి ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఓదార్చాడు. పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని స్పష్టం చేశాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని పదేపదే కోరడం.. తల్లిదండ్రులను ఎదిరించే ధైర్యం తనకు లేదంటూ రాములు వాపోయేవాడని అతని స్నేహితులు పోలీసులకు వివరించారు. ఈ స్థితిలో ఒత్తిడికి గురై ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆ సమయంలో ఎక్కడికెళ్లారు..?

ఎస్సై కోచింగ్‌కు కరీంనగర్‌కు వెళ్తున్నానంటూ సంతోషి వారం కిందట హైదరాబాద్‌ వచ్చింది. ఫిలింనగర్‌లో కారు నడపాల్సిన పని రావడంతో అతను ఈనెల 26న నగరానికొచ్చాడు. ఆ తర్వాత అతని ఫోన్‌ ఆపేసి ఉందని రాములు సోదరుడు సాయి పోలీసులకు తెలిపాడు. మరుసటి రోజు ల్యాండ్‌ లైన్‌ నుంచి ఫోన్‌ చేసి తన చరవాణి పోయిందని చెప్పారన్నాడు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు మాదాపూర్‌ లెమన్‌ట్రీ హోటల్‌లో 317 గదిని అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం 7 గంటలకు బయటికెళ్లారు. గంట తర్వాత తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఎక్కడికెళ్లారు? సంతోషి రమ్మంటేనే రాములు నగరానికొచ్చాడా? కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

చనిపోతానో.. లేదోనని ఉరేసుకొని?

గురువారం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వెళ్లినప్పుడు ఇద్దరు గొడవ పడుతూ కనిపించారని హోటల్‌ సిబ్బంది చెప్పారు. ఆ కోపంలోనే రాములు.. ప్రియురాలి గొంతును స్నానం చేసే సమయంలో బ్లేడ్‌తో కోసి ఉంటాడని, అదే బ్లేడ్‌తో తానూ గొంతు కోసుకున్నట్లు భావిస్తున్నారు. చనిపోతానో.. లేదోనన్న అనుమానంతో ఉరేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నామని మాదాపూర్‌ సీఐ రవీంద్రప్రసాద్‌ ‘ఈనాడు’కు వివరించారు.

ఉస్మానియా ఆసుపత్రి: రాములు, సంతోషి మృతదేహాలకు శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి వద్ద సంతోషి సోదరుడు రాఘవేందర్‌ మాట్లాడుతూ.. హోటల్‌ గదిలో మూడో వ్యక్తి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని