Crime News: కన్ను పీకేసి.. కత్తులతో కోసి యువతి దారుణ హత్య

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామంలో నర్సింగ్‌ విద్యార్థిని దారుణహత్యకు గురైంది.

Updated : 11 Jun 2023 18:54 IST

పరిగి: వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష(19) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది.  దీంతో కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విఠల్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసిన దుండగులు, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శిరీష ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది.

పోలీసుల అదుపులో అనిల్‌..

ఈకేసులో శిరీష అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న రాత్రి అనిల్‌ కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. శిరీష తండ్రి, సోదరుడిని ప్రశ్నించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు