logo

అర్జీలు పెండింగ్‌లో ఉంచితే చర్యలు: జేసీ

స్పందనకు వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారాలు చూపాలని జేసీ అపరాజితసింగ్‌ అధికారులను ఆదేశించారు.

Published : 28 Mar 2023 04:45 IST


దివ్యాంగునికి మంజూరైన రూ.5లక్షల చెక్కు అందజేస్తున్న అపరాజితసింగ్‌

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: స్పందనకు వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారాలు చూపాలని జేసీ అపరాజితసింగ్‌ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అర్జీలకు పరిష్కారం చూపకుండా పెండింగ్‌లో ఉంచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జేసీతో పాటు డీఆర్వో వెంకటేశ్వర్లు, కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌ శివనారాయణరెడ్డి, ఆర్డీవో కిషోర్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన ఏడు సమస్యల పరిష్కారం కోరుతూ తెదేపా దివ్యాంగుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.ఫణికుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.నరసింహ, సత్యనారాయణ తదితరులు వినతిపత్రం అందజేశారు. విజయవాడ సబ్‌-కలెక్టర్‌, తోట్లవల్లూరు తహసీల్దార్‌ సంతకాలను వీఆర్వో గోపాలకృష్ణ ఫోర్జరీ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన విషయం నిర్ధారణ అయిన దృష్ట్యా  క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు.

వాలంటీరు నుంచి ప్రాణహాని ఉంది

పెడన మండలం నందిగామ ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు కె.కృష్ణ తనపై అకారణంగా అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్‌ వీరాంజనేయులు దాడి చేసి గాయపర్చాడని, కేసు పెట్టినా ఇప్పటి వరకూ చర్యలు లేవని జేసీకి ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలతో ఫిర్యాదు కూడా చేశాడని అతని నుంచి తనకు ప్రాణహాని ఉన్న దృష్ట్యా తగు రక్షణ కల్పించాలని కోరడంతో కృష్ణ ఫిర్యాదును జిల్లా ఎస్పీకి బదలాయించారు. స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకున్న పెడనకు చెందిన అబ్దుల్‌రహీంకు నేషనల్‌ హ్యాండీక్రాప్డ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును జేసీ పంపిణీ చేశారు.

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని జేసీ అపరాజితసింగ్‌ అన్నారు. నషా ముక్తభారత్‌ అభియాన్‌లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జేసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి బాధితులను గుర్తించాలన్నారు. విద్యా సంస్థల వద్ద నిఘా ఉంచాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని