ఈ పన్నులేంటి బాబోయ్‌!

‘నగరపాలక సంస్థ పరిధిలో బతకలేకపోతున్నాం. ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఏటేటా భారీగా పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. గత రెండేళ్ల వ్యవధిలోనే ఆస్తి పన్ను 52శాతానికి పైగా పెంచేశారు.

Updated : 29 May 2023 06:27 IST

ఆదాయం కోసం ఏటా ప్రజలపైనే వడ్డింపు

‘నగరపాలక సంస్థ పరిధిలో బతకలేకపోతున్నాం. ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఏటేటా భారీగా పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. గత రెండేళ్ల వ్యవధిలోనే ఆస్తి పన్ను 52శాతానికి పైగా పెంచేశారు. ఖాళీ స్థలాలపై పన్నును 50శాతానికి పైగా పెంచేశారు. కొవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ.. జీవనమే కష్టమైపోతుంటే.. మాపై పన్నుల పేరుతో భరించలేనంత భారం మోపుతున్నారు. ఆస్తి, ఖాళీ స్థలాలు, భూగర్భ డ్రైనేజీ, చెత్త, నీటి పన్నులను భారీగా పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు.’

 విజయవాడకు చెందిన ఓ మధ్య  తరగతి ఉద్యోగి ఆవేదన ఇది.

ఈనాడు, అమరావతి : నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు 2019-20లో ఆస్తిపన్ను రూ.1,656 వచ్చేది. 2021-22లో రూ.1906కు పెంచారు. 2022-23లో రూ.2,192, ప్రస్తుతం 2023-24కు రూ.2,521 చేశారు. తాజాగా రెండేళ్ల వ్యవధిలోనే.. 52 శాతం పెంచేశారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల వ్యవధిలోనూ దీనిలో కనీసం సగం కూడా ఆస్తిపన్ను పెంచింది లేదు.

* సింగ్‌నగర్‌లో ఉన్న 100 గజాల ఖాళీ స్థలానికి 2020-21లో రూ.976 పన్ను వచ్చేది. గత రెండేళ్లలో దాదాపు 50 శాతానికి పైగా పెంచేశారు. 2021-22లో రూ.1,122, 2022-23లో రూ.1,290, తాజాగా 2023-24కు సంబంధించి రూ.1,484 వచ్చింది. విజయవాడలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఇదే స్థాయిలో వడ్డించారు. దీనిపై నగరవాసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు మాత్రం పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు.

సౌకర్యాల కల్పన మాత్రం లేదు..

విజయవాడ నగరంలో రహదారులు, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి కాలువల నిర్వహణ తీరు ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉంటోంది. కానీ ప్రజలపై పన్నులు వేయడంలో మాత్రం అధికారులు ముందుంటున్నారు. ఆస్తి, ఖాళీ స్థలాలకు మార్కెట్‌ ధర ప్రకారం పన్నులు విధిస్తున్నామంటూ ప్రజలు భరించలేనంత స్థాయిలో వడ్డిస్తూ నడ్డి విరిస్తున్నారు. అందుకే ఏమాత్రం పన్నులో రాయితీ ఇచ్చినా ప్రజలు బారులుతీరి మరీ ముందే చెల్లిస్తూ.. ఆర్థికభారం కొద్దిగా తగ్గించుకుంటున్నారు. ఈ ఏడాది పన్ను ముందుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించగానే.. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ.54 కోట్లను ముందుగా అడ్వాన్స్‌ పన్నుగా చెల్లించేశారు. అంటే రూ.2వేల పన్నుకు రూ.100 రాయితీ వస్తుందంటేనే ఇంత భారీగా చెల్లించారు. అలాంటిది ప్రజలపై భరించలేనంత భారాన్ని మోపుతూ కేవలం ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు రూ.1,656 ఉన్న బిల్లును రెండేళ్ల వ్యవధిలో రూ.865కు పైగా పెంచేశారు. ఆస్తికి మార్కెట్‌ ధర పెరుగుతోందంటూ.. దాని ప్రకారం పన్ను పెంచుతున్నామని చెబుతూ.. ఏటేటా జనం నెత్తిన పిడుగులా పన్నుల మోత మోగిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేక...

నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కనీస నిధులూ లేక పన్నుల మోత మోగిస్తూ.. జనం నుంచి పిండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నగరంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం గత రెండేళ్లలో ఇస్తామని ప్రకటించిన రూ.150 కోట్లలో ఇప్పటివరకూ కనీసం రూ.30 కోట్లు కూడా ఇవ్వలేదు. నగరానికి నిధుల పేరుతో ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే తప్ప మంజూరు మాత్రం చేయడం లేదు. ఇవికాకుండా ఏటా ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్డు గ్రాంటు, తలసరి గ్రాంట్లు కూడా ప్రస్తుతం ఆగిపోయాయి. నాలుగో స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్‌ కూడా రావాల్సి ఉంది. దీంతో అన్ని అభివృద్ధి పనులకూ.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే సాధారణ నిధులే దిక్కుగా మారాయి. ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాలు, యూజీడీ, భవనాల ఫీజులు సహా అన్నీ కలిపి ఏటా రూ.500 కోట్ల వరకూ సాధారణ నిధులు వస్తున్నాయి. వీటిని ఏటేటా మరింత పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మాత్రం దృష్టి సారించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని