logo

మీరు స్పందిస్తే సమస్యలకు పరిష్కారం

పురుగుల మందుల వ్యాపారికి రైతులు రూ.లక్షల్లో అప్పులు ఇచ్చారు. ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయి కుచ్చు టోపీ పెట్టడంతో మోసపోయామని గుర్తించిన రైతులు తమకు న్యాయం చేయాలని స్పందన కార్యక్రమంలో

Updated : 07 Dec 2021 06:17 IST

‘స్పందన’లో బాధితులవినతులు


ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టరు వివేక్‌ యాదవ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: పురుగుల మందుల వ్యాపారికి రైతులు రూ.లక్షల్లో అప్పులు ఇచ్చారు. ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయి కుచ్చు టోపీ పెట్టడంతో మోసపోయామని గుర్తించిన రైతులు తమకు న్యాయం చేయాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు వివేక్‌ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ స్పందిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చామంటున్నారు. ఇదే రీతిలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో జరిగిన స్పందనలో సోమవారం అర్జీలు అందజేశారు. కలెక్టరు వివేక్‌ యాదవ్‌ అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..

డబ్బులు ఇప్పించి ఆదుకోవాలి

గ్రామానికి చెందిన కోడె మస్తాన్‌రావు పురుగుల మందుల వ్యాపారి. పెట్టుబడి అవసరమని, రూ.2 వడ్డీ చెల్లిస్తానంటూ ప్రామిసరీ నోట్‌లపై సంతకాలు చేసి ఇవ్వడంతో రూ.2 కోట్ల వరకు ఇచ్చాం. అప్పులు తీర్చమని అడిగితే పొలం అమ్మి ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి ఉడాయించాడు. మేమంతా చిన్న రైతులమే. పంటలు పండిన దాంట్లో వచ్చిన డబ్బులను మస్తాన్‌రావుకు ఇచ్చి మోసపోయాం. మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలి.

- ఎన్‌.నటరాజశేఖర్‌, పి.వీరయ్య, పి.శ్రీనివాసరావు, వి.నాగమళ్లేశ్వరి, అప్పాపురం, నాదెండ్ల మండలం


8 నెలలుగా వేతనాల్లేవ్‌

వేతన బకాయిలు చెల్లించాలని ప్లకార్డులు చూపుతున్న ఎస్‌పీవోలు

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక అక్రమ రవాణా నివారణ విభాగంలో ఎస్‌పీవోలుగా 2020, జనవరిలో విధుల్లో చేరాం. మాకు రూ.15 వేలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. 2021, ఏప్రిల్‌ నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రూ.24 వేలు చెల్లిస్తున్నారు. వేతన బకాయిలు విడుదల చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా వేతనాలు పెంచి చెల్లించాలని కోరుతున్నాం.

- కిశోర్‌కుమార్‌, కృష్ణమోహన్‌, ఎస్‌పీవో సంఘం నాయకులు, గుంటూరు


రూ.2,500 చెల్లించకుంటే మీటర్‌ తొలగిస్తామంటున్నారు

మా ఇంటికి 2016లో విద్యుత్‌ మీటర్‌ మార్చి కొత్తది విద్యుత్‌ శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. అప్పట్లో రూ.1,700 చెల్లించా. నాలుగు రోజుల కిందట విద్యుత్‌ శాఖ ఉద్యోగి ప్రసాద్‌ వచ్చి మీటర్‌ మార్చినందుకు రూ.2,500 చెల్లించాలని, లేకుంటే మీటర్‌ తొలగిస్తానంటూ బెదిరిస్తున్నారు. నేను 2016లో చెల్లించిన నగదు రసీదు చూపిస్తే చెల్లదంటున్నారు. మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.

- కూరాకుల విజయలక్ష్మి, శివరామ్‌నగర్‌, చుట్టుగుంట


ఉపాధి లేక పస్తులు

నా తండ్రి బత్తుల చెంచయ్య ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 11, సెప్టెంబరు 2008న మరణించారు. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోగా కుడి కన్ను పని చేయకపోవడంతో పక్కన పెట్టారు. దివ్యాంగుడైన తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరుకు అర్జీ పెట్టుకున్నా. ఆయన ఆర్టీసీ ఆర్‌ఎంని పిలిపించి మాట్లాడారు. ఆర్‌ఎం ఆదేశాలతో గత సెప్టెంబరు 21న గుంటూరు బస్టాండ్‌లోని కార్గో విభాగంలో విధుల్లో చేరాను. 43 రోజులు పని చేసిన తర్వాత రూ.7 వేలు నా బ్యాంకు ఖాతాలో జమ చేసి విధుల నుంచి తప్పించారు. దీనివల్ల మా కుటుంబ సభ్యులు పస్తులు ఉంటున్నారు.

- బత్తుల చంద్రశేఖర్‌, గుంటూరు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని