logo

ఉలిక్కిపడిన అలవాల

ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉలిక్కి పడింది. రొంపిచర్ల మండలం అలవాలలో బుధవారం రాత్రి తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఇంటిలోనే దాడి జరగడం జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది.

Published : 03 Feb 2023 05:25 IST

తుపాకీ కాల్పుల మోతతో ఆందోళనలో గ్రామస్థులు

కాల్పుల్లో గాయాలైన బాలకోటిరెడ్డిని వైద్యశాలకు తరలిస్తున్న బంధువులు

రొంపిచర్ల, న్యూస్‌టుడే: ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా తుపాకీ కాల్పులతో ఉలిక్కి పడింది. రొంపిచర్ల మండలం అలవాలలో బుధవారం రాత్రి తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఇంటిలోనే దాడి జరగడం జిల్లాలోనే చర్చనీయంశంగా మారింది. ఆధిపత్య పోరులో భాగంగా ఆరు నెలల వ్యవధిలో ఆయనపై రెండోసారి హత్యాయత్నం జరగడం అది తుపాకీతో కాల్పులు జరపడం గమనార్హం. జిల్లాలో తుపాకీ పేలుళ్ల సంస్కృతి బయటపడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మండల తెదేపా అధ్యక్షుడిగా, ఎంపీపీగా, గ్రామ సర్పంచిగా పని చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్‌కి నమ్మిన బంటుగా పేరుంది. అదే ఒరవడిలో మండలంలో తెదేపా అభివృద్ధికి తన వంతు  కృషి చేస్తున్నారు. అలవాల పంచాయతీ ఎన్నికల సమయంలో తెదేపా, వైకాపా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఆ తరువాత గ్రామంలో వైకాపా, తెదేపాలో వర్గపోరు మొదలైంది. ఈ వర్గపోరుకి అలవాల తిరునాళ్ల మరింత అజ్యం పోసింది. తెదేపాలో రెండు వర్గాలు రెండు ప్రభలను, వైకాపాకు చెందిన రెండు వర్గాలు రెండు ప్రభలు కట్టారు. ప్రభల వద్దకు ఇరు పార్టీల నేతలు వచ్చిన క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అది కాస్తా పార్టీ రంగు పులుముకొని వివాదాలకు దారి తీసింది. పార్టీలపరంగా వివాదాలు సద్దుమణిగినా ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ ఆధిపత్య పోరులో భాగంగానే ఆరు నెలల వ్యవధిలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై రెండుసార్లు దాడులు జరిగాయి.

కాల్పుల ఘటనను వివరిస్తున్న బాలకోటిరెడ్డి భార్య నాగేంద్రమ్మ


కొనసాగుతున్న బందోబస్తు

తుపాకీ కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి పెద్దఎత్తున తరలివచ్చారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, గ్రామీణ సీఐ భక్తవత్సలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దింపారు. సంఘటనా స్థలంలో రెండు బుల్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. రక్త నమునాలను సేకరించారు. అనంతరం తుపాకీ కోసం పోలీసులు కోటిరెడ్డి ఇంటి పరిసరాల్లోను, పొలాలను జల్లెడపట్టారు. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. క్షతగాత్రుని భార్య అందించిన ప్రాథమిక సమాచారంతో అలవాలలో పమ్మి వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడంతో కేసు ఒక కొలిక్కి వచ్చింది. అతను ఇచ్చిన సమాచారంతో మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ కాల్పుల సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని పల్నాడు వాసులు కోరుతున్నారు. అలవాల గ్రామంలో పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని