logo

ఏనగరానికైనా.. సై

‘గన్నవరం విమానాశ్రయం నుంచి శిర్డీకి మార్చి 26న ప్రారంభం కానున్న సర్వీసులో ఇప్పటికే సగం సీట్లు నిండిపోయాయి. విజయవాడ నుంచి శిర్డీకి రైలులో వెళితే ఒక రోజు పడుతుంది.

Updated : 11 Mar 2023 05:50 IST

శిర్డీ సర్వీసులో ఇప్పటికే సగం సీట్లు నిండిపోయాయ్‌
కొచ్చి, వారణాశి, ముంబయికీ విమానాలు అవసరం
గతంలో ప్రధాన ప్రాంతాలన్నింటికీ ఉండేవి
ఈనాడు, అమరావతి

‘గన్నవరం విమానాశ్రయం నుంచి శిర్డీకి మార్చి 26న ప్రారంభం కానున్న సర్వీసులో ఇప్పటికే సగం సీట్లు నిండిపోయాయి. విజయవాడ నుంచి శిర్డీకి రైలులో వెళితే ఒక రోజు పడుతుంది. విమానంలో కేవలం రెండున్నర గంటల్లో శిర్డీలో దిగిపోవచ్చు. మధ్యాహ్నం 12.25కు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు చేరుకుంటుంది. శిర్డీ నుంచి కూడా మధ్యాహ్నం 2.20కు మరో సర్వీసు బయలుదేరి గన్నవరానికి సాయంత్రం 4.26కు వస్తుంది. టిక్కెట్‌ ధర రూ.4,639 నిర్ణయించడంతో ఎక్కువ మంది విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.  ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండగానే ఏటీఆర్‌ 72 సర్వీసులో సగం సీట్లు నిండిపోయాయి. ఈ సర్వీసు ప్రతి రోజూ శిర్డీకి ఇక్కడి నుంచి నడవనుంది.’

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని ఏ నగరానికి విమాన సర్వీసులు నడిపినా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయినా ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, విమానాశ్రయ అధికారులు విఫలమవుతున్నారు. గతంలో గన్నవరం నుంచి.. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కొచ్చి, వారణాశి నగరాలకు సర్వీసులు నడిచేవి. రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, కడపకు ఉండేవి. రోజుకు కనీసం 50కు పైగా సర్వీసులు ఇక్కడికి వచ్చి వెళ్లేవి.  ప్రస్తుతం రోజుకు 17 దేశీయ సర్వీసులు మాత్రమే గన్నవరానికి వచ్చి వెళ్తున్నాయి. వీటిలో హైదరాబాద్‌, బెంగళూరుకే 11 ఉన్నాయి. మిగతా వాటిలో దిల్లీ, చెన్నైకు రెండు చొప్పున, తిరుపతికి ఒకటి ఉన్నాయి. విశాఖ నుంచి ఒక సర్వీసు ఇక్కడికి వచ్చి.. హైదరాబాద్‌కు వెళుతోంది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక సర్వీసు మాత్రమే మధ్యాహ్నం 3.30కు విజయవాడలో ఆగి విశాఖకు వెళుతోంది. వారంలో నాలుగు రోజులు మాత్రమే కడపకు సర్వీసు నడుస్తోంది.


దిల్లీకి కూడా తగ్గించేసి...

తంలో దిల్లీకి నాలుగు సర్వీసులు ఇక్కడి నుంచి నిత్యం వెళ్లేవి. ప్రస్తుతం వాటిని రెండుకు తగ్గించేశారు. ఉదయం, రాత్రి ఒక్కో సర్వీసు ఇక్కడి నుంచి దిల్లీకి ప్రస్తుతం నడుస్తున్నాయి. నిత్యం 80 శాతం ఆక్యుపెన్షీతో దిల్లీ సర్వీసులు నడిచేవి. ఎయిరిండియా మొదట దిల్లీకి నిత్యం ఒక సర్వీసును ప్రారంభించింది. తర్వాత డిమాండ్‌ను బట్టి మరో రెండు సర్వీసులను ఆరంభించింది. వీటిలో రెండు నేరుగా గన్నవరం నుంచి దిల్లీకి, ఒక సర్వీసు హైదరాబాద్‌ మీదుగా నడిచేది. ఇండిగో కూడా ఎయిర్‌బస్‌ను దిల్లీకి నడిపింది. ఎన్ని సర్వీసులు నడిపినా ఇక్కడి నుంచి దిల్లీకి రద్దీగానే నడిచేవి. కానీ విమానయాన సంస్థలతో మాట్లాడి ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేలా చేసే వ్యవస్థ సరిగా లేదు. గతంలో తరచూ విమానయాన సంస్థలతో గన్నవరంలో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం, గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి కమిటీ, అధికారులు తరచూ ఆయా సంస్థల ముఖ్య ప్రతినిధులతో సమావేశమయ్యేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఏ సర్వీసు నడిపినా.. ఏది ఆపినా.. పట్టించుకునే వాళ్లు లేరు.


కేరళ.. శబరిమలకు

కొచ్చి, వారణాశి, ముంబయికి నడిచే సర్వీసులను ఎందుకు ఆపేశారో కూడా చెప్పకుండా సాంకేతిక కారణాలను సాకుగా చూపించి అకస్మాత్తుగా నిలిపేశారు. తాజాగా శిర్డీకి ఈనెల 26 నుంచి ఆరంభం అవుతున్న సర్వీసుకు టిక్కెట్లు బుక్కవుతున్నట్టే. ఈ మూడు ప్రాంతాలకూ ఎక్కువ రద్దీ ఉండేది. కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ప్రయాణికులు ఏటా పెద్దఎత్తున కేరళకు పర్యాటకంగా వెళ్లి వస్తుంటారు. వేసవి వస్తే.. కేరళలో సేదదీరి వచ్చేందుకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. శబరిమలకు కూడా ఏటా వేల సంఖ్యలో భక్తులు విజయవాడ నుంచే వెళ్తుంటారు. విజయవాడ నుంచి రైలులో కొచ్చి (యర్నాకులం జంక్షన్‌)కి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కొచ్చికి తిరుపతి మీదుగా గన్నవరం నుంచి విమాన సర్వీసు నడిపారు. దీనికి భారీ డిమాండ్‌ ఉండేది. కేవలం మూడు గంటల్లో అక్కడికి వెళ్లిపోయేవాళ్లు. టిక్కెట్‌ ధర కూడా రూ.4 నుంచి రూ.6వేల మధ్యలో ఉండేది. వారణాశి సర్వీసు కూడా 70శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడిచేది. ముంబయి సర్వీసుకు కూడా భారీ డిమాండ్‌ ఉండేది. ఈ నగరాలన్నింటికీ మళ్లీ సర్వీసులను పునరుద్ధరించాలంటూ ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని