Hyderabad Metro: తొలిసారిగా హైదరాబాద్‌లో భూగర్భ మెట్రో: ఎన్వీఎస్ రెడ్డి

మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు.

Updated : 29 Nov 2022 19:55 IST

హైదరాబాద్‌: మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టనున్న 31 కి.మీ. మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్‌ ఐదేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో మెట్రో రైలు ప్రారంభించి ఐదేళ్లు గడిచిన సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని వెల్లడించారు. ప్రస్తుతం నిత్యం నాలుగు లక్షల 40వేల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు కారిడార్లలో 69.2 కి.మీ. మేర మెట్రో నడుస్తోందని ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రోలో 31కోట్ల మంది ప్రయాణించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని