logo

సాగు యంత్రం.. జగన్‌ కుతంత్రం

‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్‌ యంత్రసేవ కేంద్రం (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నాం..

Updated : 10 May 2024 06:30 IST

 న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం, కౌతాళం, మద్దికెర

గొప్పలు చెప్పారు

‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్‌ యంత్రసేవ కేంద్రం (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నాం.. బృందంలో నలుగురైదుగురు సభ్యులతో పాటు ఆర్బీకే పరిధిలోని మిగిలిన రైతులకు తక్కువ ధరకే యంత్రసేవ అందుబాటులోకి తీసుకు రావాలన్న సమున్నత లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు’’ పథకం ప్రారంభోత్సవంలో జగన్‌ గొప్పలు చెప్పారు.

 తిప్పలు తెచ్చారు

ఆర్బీకేలకు ఇచ్చిన యంత్రాలు, ధరల వివరాలు అందుబాటులో ఉంచాలి. రాయితీ యంత్రాలను ఆర్బీకేల ఎదుట ఉంచి అవసరమైన వారికి అద్దెకు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరైనా తనిఖీలకు వస్తున్నారని తెలిస్తే ఇళ్ల నుంచి పరికరాలు తెచ్చి ఆర్బీకేల వద్ద ఉంచుతున్నారు.

రైతుల విన్నపాలు బుట్టదాఖలు

చిన్న ట్రాక్టర్లు, వాటికి అనుబంధ పరికరాలు, తోలు దుక్కుల మడలు, విత్తన గొర్రులు, రోటావేటర్లు, పవర్‌టిల్లర్లు, కలుపు తీసే పవర్‌ వీడర్లు, బహుళ పంటల మార్పిడి యంత్రాలు, టార్పాలిన్లు, అధునాతన తైవాన్‌ స్ప్రేయర్లు కావాలని అడుగుతున్నా...అధికారులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు.

నాడు: తెదేపా హయాంలో ‘రైతురథం’ పేరిట ఒక్కో రైతుకు రూ.2.50 లక్షల రాయితీపై 650 మందికి పైగా రైతులకు ట్రాక్టర్లు అందజేశారు. టార్పాలిన్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, రోటావేటర్లు, పవర్‌టిల్లర్లు, హార్వెస్టర్లు అందించారు. ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.30-50 కోట్ల మేర పంపిణీ చేశారు.

నేడు: సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) కింద ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి సుమారు రూ.50 కోట్లతో సాగుకు అవసరమయ్యే యాంత్రీకరణ పరికరాలు రాయితీపై ఇవ్వాలి. 2021 నుంచి 2023-24 వరకు రూ.150 కోట్ల విలువ చేసేవి పంపిణీ చేయాల్సి ఉండగా.. మూడేళ్లల్లో కనీసం రూ.30 కోట్ల విలువైనవి కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. మూడేళ్లల్లో రూ.180 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది.

అన్నీ వైకాపా నేతలకే

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం పరిధిలో వినియోగదారుల అద్దె కేంద్రాన్ని (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌- సీహెచ్‌సీ) నెలకొల్పారు. ఐదారుగురు రైతులతో బృందం ఏర్పాటు చేసింది. ఒక యూనిట్‌ విలువ రూ.15 లక్షలు.. అందులో పది శాతం రైతులు, 50 శాతం బ్యాంకు రుణం, మిగిలిన 40 శాతం రాయితీ (రూ.6 లక్షలు)గా ఉంటుంది. 2021 నుంచి 2023 వరకు కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 వైఎస్సార్‌ యంత్ర సేవా యూనిట్లు మంజూరు చేయగా... ఇందులో ఎక్కువ యూనిట్లు వైకాపా పెద్దలు, కీలక ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేసిన వారికే దక్కాయి. రైతులకు మేలు చేయాలనే ఆశయం నీరుగారింది.

20 నెలలైనా..ఇచ్చింది ఒక్కటీ లేదు..

2022 ఆగస్టులో రాయితీపై కర్నూలు జిల్లాలో 25 మండలాలకు 75, నంద్యాల జిల్లాలో 28 మండలాలకు 84 కలిపి 159 డ్రోన్లు రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. 20 మాసాలు గడిచినా రాయితీపై ఒక్కటీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు 37 మంది పైలట్‌ శిక్షణ పూర్తి చేసుకోగా.. నంద్యాల జిల్లాలో మరో 40 మంది సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయినా ఇప్పటివరకు డ్రోన్లు సరఫరా చేయలేదు.

అద్దె లెక్కలు బురిడీ

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి 2,717 మంది రైతులు అద్దె ప్రాతిపదికన యంత్రాలు తీసుకున్నారు. తీసుకున్న వారి వివరాలు యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా... అలా జరగడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 877 యూనిట్లు మంజూరు చేయగా కర్నూలు జిల్లాలో 84 సీహెచ్‌సీలు, నంద్యాల జిల్లాలో 32 మాత్రమే వినియోగంలో ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ వెల్లడించిన నివేదికలే చెబుతున్నాయి. ప్రభుత్వ తీరుతో రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు