logo

Telangana News: వ్యాయామం చేసి వచ్చాక.. యువకుడి మృతి

జిమ్‌ చేసి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Updated : 24 Mar 2023 15:55 IST

జిమ్‌లో మాజిద్‌ హుస్సేన్‌ షోయబ్‌

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : జిమ్‌ చేసి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, స్నేహితుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ పట్టణం రామయ్యబౌలికి చెందిన మాజిద్‌ హుస్సేన్‌ షోయబ్‌ అలియాస్‌ జున్ను(23) రోజు వారీ వేతనంపై పురపాలికకు సంబంధించిన కొలతలు తదితర పనులకు వెళ్లేవాడు. నిత్యం జిమ్‌కు వెళ్లేవాడు. రోజూ లాగే గురువారం రాత్రి న్యూటౌన్‌ ప్రాంతంలోని ఓ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. రాత్రి 11 గంటలకు ఛాతీలో నొప్పిగా వచ్చింది. వాంతులు కూడా చేసుకున్నాడు.

సాధారణమైనదేనని భావించి ఇంటి ముందు వాకింగ్‌ చేయటం ప్రారంభించాడు. ఈక్రమంలో తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. చిన్న వయస్సులో ఇలా జరగటం అందరినీ కలచివేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులంతా శోకసంద్రంలో మునిగారు. మొదటి పట్టణ ఠాణా ఎస్సై రామకృష్ణను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా జిమ్‌ నుంచి వచ్చాక గుండెపోటు వచ్చి యువకుడు మరణించాడని తెలిసిందని, దీనిపై ఫిర్యాదేమీ రాలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని