logo

Suryapet: సోదరుడే హంతకుడు.. వీడిన ఉద్యోగిని హత్య మిస్టరీ

సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి(పబ్లిక్‌ హెల్త్‌నర్స్‌-పీహెచ్‌ఎన్‌)ని అనుములపురి స్వరూపారాణి (53)ని ఆస్తి కోసం ఆమె సోదరుడు అనుములపురి రాజకుమార్‌ హత్య చేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డె వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఒక చరవాణితోపాటు మూడు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Updated : 09 Nov 2023 13:45 IST

వీడిన ఉద్యోగిని హత్య మిస్టరీ

సూర్యాపేటలో నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డె, చిత్రంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, తదితరులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి(పబ్లిక్‌ హెల్త్‌నర్స్‌-పీహెచ్‌ఎన్‌)ని అనుములపురి స్వరూపారాణి (53)ని ఆస్తి కోసం ఆమె సోదరుడు అనుములపురి రాజకుమార్‌ హత్య చేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డె వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఒక చరవాణితోపాటు మూడు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపిన కేసు వివరాల ప్రకారం.. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన స్వరూపారాణి ఈ నెల 5న తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విదితమే. పెన్‌పహాడ్‌ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రాజకుమార్‌ తన చెల్లెలు స్వరూపారాణి వద్ద పదేళ్ల క్రితం తన తండ్రి పేరున ఉన్న మూడు వందల గజాల ప్లాట్‌ దస్త్రాలు కుదువపెట్టి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు ఇస్తానని ప్లాట్‌ కాగితాలు తిరిగి ఇవ్వాలంటూ ఆరు నెలలుగా తన చెల్లెలును అడుగుతున్నాడు. నాన్న సంపాదించిన ఆస్తిలో తనకూ సమాన వాటా ఉంటుందని, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లెక్క కడితే నీ వాటాకు లెక్క సరిపోతుందని స్వరూపారాణి బదులు చెబుతూ వస్తోంది. ప్లాట్‌ కాగితాలు ఇవ్వకపోవడంతో చెల్లెలుపై కోపం పెంచుకున్న రాజకుమార్‌ ఆమెను హత్య చేసి కాగితాలతోపాటు ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా ఈ నెల 5వ తేదీ సాయంత్రం సీతారాంపురంలోని స్వరూపారాణి ఇంటికి వెళ్లి ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకొని ఇనుప కడ్డీతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె మెడ మీద ఉన్న పుస్తెలతాడు తీసుకొని, అక్కడున్న వస్త్రాలకు నిప్పంటించి ఆమె ముఖంపై వేసి, విద్యుదాఘాతంతో మృతిచెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం వెళ్లాడు. హత్య జరగడానికి ముందు రాజకుమార్‌ మృతురాలి ఇంటికి వచ్చి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, ఎస్సై మహేంద్రనాథ్‌, హెడ్‌కానిస్టేబుల్‌ కరుణాకర్‌, కృష్ణ, సైదులు, కానిస్టేబుల్స్‌ ఆనంద్‌, సైదులు, మధును ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని