logo

తెదేపా మేనిఫెస్టోతో వైకాపాలో వణుకు

ఇటీవల జరిగిన ‘మహానాడు’తో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తెదేపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.

Published : 02 Jun 2023 03:28 IST

ఎన్నికలెప్పుడొచ్చినా తెదేపా గెలుపు తథ్యం
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

సమావేశంలో మాట్లాడుతున్న వంగలపూడి అనిత, పక్కన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈతలపాక సుజాత

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన ‘మహానాడు’తో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని తెదేపా మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తొలిదశ మేనిఫెస్టోకు లభించిన ప్రజాదరణ చూసి వైకాపా నేతలు, మంత్రుల్లో వణుకు మొదలైందన్నారు. ఈ మేనిఫెస్టోలోని అంశాలపై వైకాపా మంత్రులు ఏవేవో మాట్లాడడం దారుణమన్నారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీల్లో 45ఏళ్లు వచ్చిన మహిళలకు పింఛను, దశలవారీ మద్యపాన నిషేధం, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, ఇంటింటికి కుళాయి, సీపీఎస్‌ రద్దు ఇంతవరకు అమలు చేయలేకపోయారని ఆరోపించారు. సంపాదించే వారికే అప్పు చేసే హక్కు ఉంటుందని, జగన్‌ మాదిరిగా సంపద సృష్టించకుండా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్‌  ఏపీ ముందంజలో ఉందని.. ఇదేనా పురోగతి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్‌ తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు వెన్నుదన్నుగా 70లక్షల మంది తెదేపా సైన్యం ఉందన్నారు. నిజంగా ప్రజాదరణ ఉంటే..గడపగడపకు వెళ్లేటప్పుడు వైకాపా నేతలకు పోలీసు భద్రత ఎందుకని అనిత ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈతలపాక సుజాత పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని