తుగ్లక్‌ పాలన!

తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లూ కుట్టి చంపుతుంది. మూడున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అచ్చం అలాగే కాల్చుకుతింటోంది. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారు’ అంటూ విపక్షనేతగా జగన్‌ మొసలి కన్నీళ్లు కార్చారు.

Updated : 05 Jan 2023 09:31 IST

తేలుకు పెత్తనమిస్తే తెల్లార్లూ కుట్టి చంపుతుంది. మూడున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అచ్చం అలాగే కాల్చుకుతింటోంది. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నారు’ అంటూ విపక్షనేతగా జగన్‌ మొసలి కన్నీళ్లు కార్చారు. అధికారంలోకి వచ్చాక ఇక తనకు ఎదురాడేవారే ఉండకూడదన్నట్లుగా పేట్రేగిపోతున్న ఆయన- ఏపీలో అక్షరాలా అరాచక రాజ్యాన్ని స్థాపించారు. తన విమర్శకులపైకి యథేచ్ఛగా పోలీసులను ఉసిగొల్పుతున్న వైకాపా సర్కారు ఆదినుంచీ చట్టానికి వక్రభాష్యం చెబుతోంది. ఆ అప్రజాస్వామిక ధోరణులకు పరాకాష్ఠగా రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీల వంటివాటిని నిషేధిస్తూ నిశిరాత్రి వేళ నల్ల జీఓ నంబరు ఒకటిని అది జారీచేసింది. చంద్రబాబు కందుకూరు సభలో తొక్కిసలాట, గుంటూరు ఘటనల కారణంగానే ఆ జీఓ తేవాల్సి వచ్చిందని ‘సకల శాఖల మంత్రి’ సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. జరిగినవి చాలా దురదృష్టకరమైన ఘటనలు. బందోబస్తు ఏర్పాట్లలో పోలీసుల దారుణ వైఫల్యాలే ఆ రెండు చోట్లా అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తన పౌరులందరికీ భద్రత కల్పించడం రాజ్యం ప్రాథమిక బాధ్యతగా న్యాయపాలిక గతంలో స్పష్టీకరించింది. జగన్‌ సర్కారుకు అది చేతకాక... శవాలపై పేలాలు ఏరుకునే చిల్లర రాజకీయాలకు పాల్పడుతోంది. దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాల్లో ఏపీ ఏడో స్థానంలో ఉంది. అలాగని వాహనాలను నిషేధిస్తారా? ఇదేమి తుగ్లక్‌ పాలన? ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకుంటున్న మద్యం రక్కసిని జగన్‌ సర్కారు తనివితీరా ముద్దుచేస్తోంది. ప్రజాప్రయోజనాల కోసమైతే ముందు ఆ నెత్తుటికూటికి ఎగబడటం మానేయాలి కదా! కుప్పం, మండపేటల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలలోనూ దుర్ఘటనలు చోటుచేసుకుని, మరణాలు సంభవించాయి. అభివృద్ధి, వాస్తవ జన సంక్షేమాల పొడగిట్టని జగన్‌ రెడ్డిలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజాభీతి పెరిగిపోతోంది. అందులోంచి ప్రకోపిస్తున్న పైత్యమే- ప్రతిపక్షాలూ ప్రజాసంఘాల నోళ్లను నొక్కేసే కుత్సిత జీఓగా రూపుదాల్చింది!    

‘జబ్‌ సడకేం శూనీ హో జాతీ హై, తో సంసద్‌ ఆవారా హో జాతీ హై’ (వీధులు నిర్మానుష్యమైతే చట్టసభలు దారితప్పుతాయి)- ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపించేందుకు ప్రజాందోళనలు తప్పవన్న రామ్‌మనోహర్‌ లోహియా విశిష్ట వ్యాఖ్య ఇది. ప్రజాస్వామ్య హితైషులైన అటువంటి నాయకులకు మారుగా ఒకటో నంబరు నేరగాళ్లే నేతలవుతున్నారిప్పుడు! నిరసనకారుల గొంతులను వాళ్లు కర్కశంగా నులిమేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం న్యాయబద్ధంగా నిజాయతీతో విధులు నిర్వర్తించాలన్నది సుప్రీంకోర్టు ఉద్బోధ. దానికి మన్నన దక్కని ఏపీలో ముఖ్యంగా పోలీసులు వైకాపా పెంపుడు మనుషులుగా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో సర్కారును విమర్శించే వాళ్లను రాచి రంపాన పెట్టే విభాగంగా రాష్ట్ర సీఐడీ మరీ పరువుమాస్తోంది. ‘గౌరవ ప్రతిష్ఠలు ముఖ్యమంత్రికే కాదు, ప్రతి ఒక్కరికీ ఉంటాయి... అందరి గౌరవాన్ని కాపాడే బాధ్యత పోలీసులదే’నని హైకోర్టు స్పష్టంచేసినా- ఖాకీ యంత్రాంగం అధికారపక్షానికే ఎల్లవేళలా కొమ్ముకాస్తోంది. జగన్‌ పర్యటనల్లో చీమ చిటుక్కుమనకుండా ఊళ్లను దిగ్బంధిస్తున్న యంత్రాంగం తీరు- జనజీవనానికి నరకప్రాయమవుతోంది. విపక్షాల కార్యక్రమాలకు అనుమతులు బిగపట్టడం నుంచి అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా అవాంతరాలు కల్పించడం వరకు జగన్‌ ఏలుబడిలో చట్టబద్ధమైన పాలన అన్నదే ఎక్కడా కనిపించడం లేదు. నిరసనలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలను ప్రజాస్వామ్యానికి పునాదులుగా అభివర్ణించిన ఏపీ ఉన్నత న్యాయస్థానం- ప్రాథమిక హక్కులను పెళ్లగిస్తున్న ప్రభుత్వ పెడపోకడలను ఇటీవలే తూర్పారపట్టింది. రాజకీయ రోడ్డు షోలు, బైక్‌ ర్యాలీలను నిషేధించాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గతంలో కొట్టిపారేసింది. ‘ప్రజాస్వామ్యంలో ఉన్నారో... రాచరికంలో ఉన్నారో ఆలోచించుకోవాలి’ అంటూ పదవిలోకి రాకముందు జగన్‌ ఎన్నో నీతులు వల్లించారు. అసమ్మతిని సహించలేనితనంతో ఇప్పుడు అణచివేతను ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. నూటఅరవై ఏళ్ల కిందటి పోలీస్‌ చట్టం- వలస పాలనాయుగ అవశేషం. తాజా జీఓతో దానికి కోరలు తొడగడం- జగన్‌ రెడ్డి వ్యక్తిత్వంలోని తెల్లదొరల దమననీతికి ప్రతిబింబం. తిరగబడిన ప్రజానీకం ధాటికి మహానియంతలే నేలమట్టమయ్యారు. అధికార మదంతో కన్నూమిన్నూ కానక ఎగిరెగిరిపడుతున్న పిల్ల ఫాసిస్టు జగన్‌ రెడ్డి భవిష్యత్తూ తద్భిన్నంగా ఉండబోదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.