icon icon icon
icon icon icon

పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే.. భారాసను రద్దు చేస్తారా?

జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్‌ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 24 Apr 2024 03:34 IST

కేసీఆర్‌, హరీశ్‌రావులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌
రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన
రాబోయే వరి పంటకు రూ.500 బోనస్‌ ఇస్తామని వెల్లడి

ఈనాడు-మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, మద్దూరు, కోస్గి-న్యూస్‌టుడే: జోగులాంబ అమ్మవారి సాక్షిగా, సేవాలాల్‌ సాక్షిగా మాట ఇస్తున్నానని, ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తారా అని భారాస నేత హరీశ్‌రావు అడుగుతున్నారని, పంద్రాగస్టు నాటికి రుణమాఫీ చేస్తే భారాసను రద్దు చేసుకుంటారా అని కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఆయన సవాల్‌ చేశారు. రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులిస్తూ ఇబ్బందులకు గురిచేయవద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రైతులను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో, నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశంలో సీఎం ప్రసంగించారు.

మేం వచ్చేనాటికి రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్‌

2014లో భారాస(అప్పటి తెరాస) ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయింది. 2018లో మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. నేను రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను. అయితే మేము అధికారం చేపట్టేనాటికి ఖజానా దివాలా తీసి.. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిసెంబరు 7న సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్న రోజున రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.26 వేల కోట్ల వడ్డీ చెల్లించాం. అసెంబ్లీకి వస్తే కేసీఆర్‌కు లెక్కలు చూపిస్తాను. ఎన్నికల కోడ్‌ అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమలులో ఆలస్యమైంది. సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన నన్ను ఎలా దించేయాలి, కాళ్లలో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలి అని ఆలోచించడం కేసీఆర్‌కు తగదు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదు అమలు చేశాం. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల పంపిణీ, ఇంటికో ఉద్యోగం, ఫీజు రీయింబర్స్‌మెంటు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి వంటి హామీలను అమలు చేయలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించారా? ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేశారా? ఇవేమీ చేయకుండా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే రేవంత్‌రెడ్డి దిగిపోవాలని అనడం ఎంతవరకు సమంజసం? ప్రజలను కలవకుండా, వారి కష్టాలు తెలుసుకోకుండా కేసీఆర్‌ పదేళ్లు ఎలా పాలించారో ప్రజలకు తెలుసు. నేను నాలుగు నెలల్లో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు. పేదలకు ఇళ్లు నిర్మించలేదు. రైతులకు ఆదాయం రెట్టింపు చేయలేదు. చెప్పుకోవడానికి ఏమీలేక మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం..

2014లో రాష్ట్రం ఏర్పాటు తర్వాత పాలమూరుకు మంత్రి పదవులు, నిధులు, నియామకాలు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంలో కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్‌.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. పదేళ్లుగా నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని తొక్కిపెట్టారు. 2009లో ఆయనను ఎంపీగా గెలిపిస్తే పాలమూరుకు చేసిందేమీ లేదు. 2009లో కృష్ణా నదికి భారీ వరదలు వచ్చినప్పుడు తన ఇల్లు అమ్మి అయినా అలంపూర్‌లో ముంపు బాధితులకు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఎందుకు కట్టించలేదు?

నాకు ప్రత్యర్థులు, శత్రువులు లేరు..

పాలమూరు జిల్లాలో నాకు ప్రత్యర్థులు, శత్రువులు ఎవరూ లేరు. పాలమూరు బిడ్డనైన నాకు సీఎంగా అవకాశం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. భాజపా నేత డీకే అరుణతో నాకేమైనా ఆస్తి తగాదాలు.. గట్టు పంచాయతీలున్నాయా? పాలమూరు జిల్లాకు శత్రువులైన వారితో ఆమె జతకట్టారు. సీఎంగా రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నా. ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలని ఆలోచించా. కానీ, కాళ్లలో కట్టెలు పెట్టి లాగడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు? కృష్ణా-వికారాబాద్‌ రైల్వేలైన్‌ ఎందుకు పూర్తి చేయలేదు? గతంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ అప్పట్లో కోస్గిలో రెండు వరుసల రోడ్లు ఎందుకు వేయలేదు? మన్నెగూడ, గుల్బర్గా రోడ్డును ఎందుకు బాగుచేయలేదు? గత శాసనసభ ఎన్నికల్లో గద్వాలలో భాజపా అభ్యర్థికి 7 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటప్పుడు ఆమెతో నాకు పోటీ ఏంటి?

వర్గీకరణకు ప్రవీణ్‌కుమార్‌ వ్యతిరేకమా?

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు ఆయనకు అండగా ఉన్నా. ఆయన రాజీనామా చేస్తే కేసీఆర్‌ ఇబ్బంది పెట్టారు. కేసీఆర్‌ను గద్దె దించుతానని ఆ రోజు ప్రవీణ్‌ అన్నారు. ఆరు నెలల్లోనే కేసీఆర్‌లో ఏం మారింది? ఆయన బీఎస్పీలో కొనసాగినా బాగుండేది. లేకపోతే కాంగ్రెస్‌లోకి వచ్చి కేసీఆర్‌పై కొట్లాడాల్సింది. శాసనసభలో నాతోపాటు సంపత్‌కుమార్‌ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెడితే అప్పటి భారాస ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని బయటకు పంపించింది. వర్గీకరణపై అఖిలపక్ష పార్టీలను దిల్లీకి తీసుకెళ్తానని చెప్పి పదేళ్లు సాగదీసింది. వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మమ్మల్ని సభలో నుంచి బయటకు పడేసిన కేసీఆర్‌ పక్కన చేరిన ప్రవీణ్‌కుమార్‌ వర్గీకరణకు వ్యతిరేకమా? ప్రజలు తిరస్కరించిన కేసీఆర్‌ పక్కన చేరి తెలంగాణ సమాజం ఎదుట దోషిగా నిలబడతారా? ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఈ రోజు డీజీపీ స్థాయిలో ఆయన ఉండేవారు. ఆయనను టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించాలని అనుకున్నాం.

పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తా

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా మహబూబ్‌నగర్‌ నుంచి వలసలు ఆగలేదు. కరవు పోలేదు. పొలాల్లో నీరు పారలేదు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. ఎన్ని వేల కోట్లయినా నిధులిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రిగా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటా. మీ బిడ్డగా పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేస్తాను’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థులు మల్లు రవి, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కె.రాజేశ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి, తెజస నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతులు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. నేను సీఎంనయ్యాను. వారి రుణం తీర్చుకోకపోతే ఈ జీవితం దండగని తెలుసు. హరీశ్‌రావులా, కేసీఆర్‌లా అవాస్తవాలు చెప్పేవాడిని కాదు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్‌ అన్నారు. నేను మాత్రం పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాబోయే వరి పంటకు రూ.500 బోనస్‌ కూడా ఇస్తాను.

సీఎం రేవంత్‌రెడ్డి


బావాజీని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బంజారా గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీగురులోకమసంద్‌ను(బావాజీని) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ గోపాల్‌, కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, మద్దూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img