icon icon icon
icon icon icon

భారాస.. కాంగ్రెస్‌ కలిసిపోయాయ్‌

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ  అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు.

Updated : 26 Apr 2024 05:41 IST

రాష్ట్రాన్ని దిల్లీకి ఏటీఎం చేసిన హస్తం పార్టీ
కేంద్రంలో మోదీ ప్రభుత్వంతోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి
ఇక్కడ 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి
4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం
సిద్దిపేట విశాల జనసభలో అమిత్‌షా

సిద్దిపేట, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉంటేనే తెలంగాణలో సంపూర్ణ  అభివృద్ధి జరుగుతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిగా చేస్తే తెలంగాణలో అవినీతిని అంతం చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తక్కువ సమయంలోనే తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో భారాస, కాంగ్రెస్‌ కలిసిపోయాయని ఆరోపించారు. భారాస అనేక కుంభకోణాలకు పాల్పడిందన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌, భూ కుంభకోణాలపై కాంగ్రెస్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం పార్టీ నిర్వహించిన విశాల జనసభలో అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు. మెదక్‌ నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు వేసే ఓటు మోదీని తిరిగి ప్రధానిగా చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ‘‘రాష్ట్రంలో 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి. మజ్లిస్‌ పార్టీకి భయపడి భారాస, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. కానీ భాజపాకు మజ్లిస్‌ అంటే భయంలేదు. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ  విమోచనదినంగా అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, భారాస ప్రభుత్వాలు ముస్లింలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఈ వాటాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. దేశ వ్యాప్తంగా మోదీకి 400 సీట్లను ఇవ్వండి. పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర  ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది. ఐదేళ్లలో రామమందిరం కేసు గెలవడమే కాకుండా  అయోధ్యలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. విగ్రహప్రతిష్ఠ నిర్వహించి అందరూ  జై శ్రీరాం అనేలా చేశాం. మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను శాశ్వతంగా భారతదేశంలో అంతర్భాగం చేసింది’’ అని అమిత్‌షా వివరించారు.

ప్రసంగం 9 నిమిషాలే...

దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన అమిత్‌షా ప్రత్యేక హెలికాప్టర్‌లో సిద్దిపేటకు చేరుకున్నారు. సభ అనంతరం మళ్లీ శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చి భువనేశ్వర్‌ వెళ్లారు. సిద్దిపేట బహిరంగ సభలో అమిత్‌షా ప్రసంగం దాదాపు 9 నిమిషాలు సాగింది. వాస్తవానికి ఆయన  మధ్యాహ్నం 12 గంటలకు రావాలి. 1.55కి వచ్చారు. పది నిమిషాల్లోనే పర్యటన ముగిసింది. ఆలస్యం, భువనేశ్వర్‌లో పార్టీ కార్యక్రమం నేపథ్యంలో ఆయన సిద్దిపేటలో తక్కువసేపే గడిపారు.

మోసానికి పర్యాయపదం కాంగ్రెస్‌: రఘునందన్‌రావు

భాజపా అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ మోసానికి పర్యాయపదమే కాంగ్రెస్‌ అని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పింఛనుదారులకు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను ఆ పార్టీ వంచించిందని అన్నారు. బీసీలకు అది అన్యాయం చేసిందని జిల్లా నుంచి బీసీ ఎమ్మెల్యేకు క్యాబినెట్‌లో స్థానం కల్పించలేదన్నారు. దుబ్బాక, ఇతర ప్రాంతాల్లో భాజపా చేపట్టిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలుగులో రాసిన పుస్తకం పోస్టు చేశానని చెప్పారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రాజెక్టులు నిర్మించారన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని తనను విమర్శించే నాయకులు.. కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. రిజర్వేషన్లను తొలగిస్తారంటూ భాజపాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌కు రైలు తెచ్చిన ఘనత కూడా తమదేనని అన్నారు. భాజపాను ఓడించేందుకు సీఎం, మాజీ మంత్రి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. భారాస లోక్‌సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్‌ కాళ్లు మొక్కి 2021లో ఎమ్మెల్సీ అయ్యారని, అప్పటి నుంచి జిల్లా ప్రజల కోసం ఒక్క రూపాయి వెచ్చించలేదని, ఎంపీగా గెలిచిన తరువాత రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఈ సభలో భాజపా రాష్ట్రనేత ఈటల రాజేందర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.


‘సహారా ఇండియా’ బాధితుల నిరసన

ఏళ్ల కిందట సహారా ఇండియా సంస్థలో పెట్టుబడులు పెట్టిన పలువురు తమ సొమ్ము ఇప్పించాలంటూ అమిత్‌షా ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో నిల్చుని సుమారు రెండు నిమిషాలు నిరసన వ్యక్తం చేయగా.. అది గమనించి ముందు వరుసల్లో ఉండే పార్టీ శ్రేణులు జై మోదీ అంటూ నినదించారు.
తెలంగాణ ప్రజల మూడ్‌ అంతా మోదీతో కలిసి వెళ్లాలని ఉంది. ప్రతి స్థానంలో కూడా కమలానికి ఓటేసి భాజపాను గెలిపించి మోదీకి మద్దతుగా నిలవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

అమిత్‌షా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img