icon icon icon
icon icon icon

అభ్యర్థుల చదువు అంతంతే..!

రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల (51)లో మూడోవంతు మంది (17) ఇంటర్‌, ఆలోపే చదువుకున్నారు.

Published : 28 Apr 2024 04:19 IST

33% మంది ఇంటర్‌.. ఆలోపే
11 మంది పోస్టుగ్రాడ్యుయేట్‌లు
ప్రధాన పార్టీల అభ్యర్థుల విద్యార్హతలివీ..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల (51)లో మూడోవంతు మంది (17) ఇంటర్‌, ఆలోపే చదువుకున్నారు. ఐదుగురు వైద్యులు కాగా.. మజ్లిస్‌ అభ్యర్థితో కలిపి ఐదుగురు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక మాజీ ఐఏఎస్‌ అధికారి, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల అఫిడవిట్ల మేరకు వారి విద్యార్హతలివీ..

ఆరుగురు పది, ఆలోపు

ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్నవారిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవారు ఆరుగురు కాగా.. ఇంటర్‌ చదివిన వారు 11 మంది ఉన్నారు.

అఖిల భారతస్థాయి అధికారులు..

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి మెదక్‌ నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి భారాస తరఫున బరిలో ఉన్నారు.    

మరో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌ నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

విదేశాల్లో చదువుకున్నవారు ఐదుగురు...

  • ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేశారు.
  • హైదరాబాద్‌ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ లండన్‌లో లా పూర్తిచేశారు.
  • చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అమెరికాలో ఎంఎస్‌ చదివారు.  
  • పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చేశారు.
  • భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైప్రస్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివారు.

వైద్యులు వీరే..

మల్లు రవి (కాంగ్రెస్‌), కడియం కావ్య (కాంగ్రెస్‌), బూర నర్సయ్యగౌడ్‌ (భాజపా), సుధీర్‌కుమార్‌ (భారాస)లు ఎంబీబీఎస్‌, ఆపై చదువులతో వైద్యులుగా సేవలందించారు. చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్‌ (ఎంవీఎస్సీ) చేశారు.

పీహెచ్‌డీ, పీజీ..

  • మహబూబాబాద్‌ భాజపా అభ్యర్థి ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌ పీహెచ్‌డీ చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి సహా 11 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు (పది మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ).
  • ఒకరు బీటెక్‌ చేయగా.. మరో 10 మంది వివిధ డిగ్రీలు చదివారు. బీబీ పాటిల్‌ (భాజపా), సురేశ్‌షెట్కార్‌ (కాంగ్రెస్‌)లు మహారాష్ట్రలో ఏజీ బీఎస్సీ చేశారు. ఇద్దరూ జహీరాబాద్‌లో తలపడుతున్నారు. టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), బి.వినోద్‌కుమార్‌ (భారాస), రఘునందన్‌రావు (భాజపా)లు న్యాయవిద్య (ఎల్‌ఎల్‌బీ) అభ్యసించారు.
  • ఇద్దరు డిప్లొమా పూర్తిచేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img